Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో ధరలు భగ్గుమంటున్నాయని సర్కారు తాజాగా వెల్లడించిన గణాంకాలు తెలిపాయి. గడిచిన సెప్టెంబరు మాసంలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.99 శాతానికి చేరుకుంది. ఆహారోత్పత్తుల ధరలు పెరగడమే ప్రధాన కారణంగా ద్రవ్యోల్బణం అమాంతం పెరిగినట్టుగా సర్కారు సోమవారం తెలిపింది. వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ అంతకు ముందు ఆగస్టు మాసంలో 3.28 శాతంగా నిలిచింది. ఏడాది ప్రాతిపదిక చూస్తే గత ఏడాది సెప్టెంబరు మాసంలో దేశ ద్రవ్యోల్బణం 3.70 శాతంగా ఉంది. ఆహరోత్పత్తుల ధరల పెరుగుదల 5.11 శాతంగా నిలిచింది. అంతకు ముందు నెలలో ఇది 2.99 దరిదాపుల్లో ఉన్నట్టుగా గణాంకాలు మరియు పథకాల అమలు శాఖ సోమవారం తెలిపింది. సెప్టెంబరు మాసంలో కూరగాయల ధరల్లో 15.40 శాతం మేర వృద్ధి నమోదు అయింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ఆర్బీఐ నిర్దేశించుకున్న పరిధిలోపే నమోదు కావడం.. కొంత ఊరటనిచ్చే అంశమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
దిగివచ్చిన టోకు ధరల సూచీ..
ఆహారేతర ఉత్పత్తుల ధరలు పడిపోవడంతో సెప్టెంబరు మాసంలో టోకు ధరల ఆధారిత ద్రవోల్బణ సూచీ 0.33 శాతానికి చేరినట్టుగా ప్రభుత్వం సోమవారం తెలిపింది. అంతకు ముందు ఆగస్టు మాసంలో ఈ ద్రవ్యోల్బణం 1.08 శాతంగా ఉంది. సెప్టెంబరు మాసంలో టోకు ధరల ఆధారిత వార్షిక ద్రవ్యోల్బణ రేటు సూచీ 5.22 శాతంగా నిలిచినట్టుగా ప్రభుత్వ తెలిపింది. టోకు రూపంలో విశ్లేషించి చూస్తే ఆహారోత్పత్తులు ధరలు 7.47 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో ఆహారేతర ఉత్పత్తుల ధరల్లో పడిపోవడంతో ఈ విభాగం ద్రవ్యోల్బణం 2.18 శాతంగా నిలిచింది.