Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దక్షిణ భారత దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ప్రోటీన్ల లోపం అధికంగా కనిపిస్తోందని గోద్రేజ్ గ్రూపునకు చెందిన క్రీమ్లైన్ డెయిరీ ప్రోడక్స్ మంగళవారం విడుదల చేసిన 'సౌత్ ఇండియా ప్రొటీన్ గ్యాప్' నివేదిక తెలిపింది. 'జెర్సీ' బ్రాండ్తో పాల ఉత్పత్తులను అందించే క్రీమ్లైన్ డెయిరీ సంస్థ తాము నిర్వహించిన సర్వే ప్రకారం 83 శాతం మంది ప్రొటీన్ లోపంతో ఉన్నట్టుగా గుర్తించామని తెలిపింది. ఈ నివేదికను క్రీమ్లైన్ ప్రొడక్ట్సు ఎండీ భాస్కర్ రెడ్డి, సీఈవో రాజ్ కన్వర్, న్యూట్రిషియనిస్టు ధరణి కృష్ణన్లు ఆవిష్కరించారు. ఈ సర్వే రిపోర్టు ప్రకారం.. దక్షిణాదిలో పెద్ద వాళ్లలో కేవలం 32 శాతం మంది మాత్రమే తగు విధంగా పాలు తీసుకుంటున్నారని. ముఖ్యంగా శాఖహారుల్లో ఈ ప్రొటీన్ లోపం మరింత ఎక్కువగా ఉన్నట్లు తాము గుర్తించామని కన్వర్ తెలిపారు. దక్షిణ భారతీయులు అత్యధికంగా మాసాన్ని భుజిస్తున్నప్పటికీ ప్రోటీన్ లోపం కనిపించడం విశేషమని ఆయన అన్నారు. ఇక్కడ మాంసం వినియోగం తక్కువగా ఉండడంతో పాటు పాల వినియోగం తక్కువగా ఉండడం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. పాలు తాగడం వల్ల తగిన ప్రోటీన్లు శరీరానికి అందుతాయన్న అవగాహన ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఎక్కువగా 68 శాతం మేర కనిపించిందని తెలిపారు. ఆ తరువాత అత్యధికంగా ఈ అవగాహన చెన్నై, బెంగళూరు నగరాలలో కనిపించిందన్నారు. తలసరి పాల వినియోగం సగటున 400 మి.లీ. ఉండాల్సి ఉండగా.. దక్షిణాదిన ఇది కేవలం 330 మి.లీ.కే పరిమితం అవుతున్నట్టుగా ఆయన తెలిపారు.