Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాదికి వృద్ధి 6.1 శాతమే
- సబ్బిడీ వ్యయాల్ని మరింత హేతుబద్దీకరించాలి
- ఆర్థికంలో ప్రభుత్వపు పాత్రను తగ్గించుకోవాలి
- నియామకాలు, ఉద్యోగ కోతల్ని సంస్కరించాలి
- వ్యవస్థలో విశ్వాసాన్ని నింపే చర్యలు చేపట్టాలి
- పన్ను విస్తృతి మరింత పెంచాలంటూ సూచన
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న చక్రీయ బలహీనతను తట్టుకొనేందుకు గాను భారత్ విస్తృత స్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా 'వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్' నివేదికలో సూచించింది. ప్రభుత్వ రుణాన్ని తగ్గించేందుకు గాను మధ్యస్థ కాలానికి విశ్వసనీయమైన ఆర్థిక ఏకీకరణ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. దీనికి తోడు సబ్సిడీ వ్యయాన్ని హేతుబద్ధీకరించాలని.. పన్ను విస్తృతిని పెంచేందుకు గాను చర్యలు తీసుకోవాలని భారత్కు సూచించింది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ పాత్రను గణనీయంగా తగ్గించుకోవాలని సూచించింది. కొత్త నియామకాలు, ఉద్యోగ కొతల విషయంలో సంస్కరణలను తీసుకురావాలని, ఉద్యోగ కల్పనలకు తగిన ప్రోత్సాహకాలను కలిగించాలని నివేదిక తెలిపింది. మౌలిక రంగ అభివృద్ధికి గాను దేశంలో భూసంస్కరణల వేగం పెంచాలని సూచించింది. అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ ప్రభావం గ్లోబల్ వృద్ధి రేటును మందగించేలా చేస్తోందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2008-2009 నాటి మాంద్యం చాయలకు దారి తీస్తుందని హెచ్చరించింది. 2019లో గ్లోబల్ జీడిపి వృద్ధి 3.0 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. ఇంతక్రితం జులైలో ఈ అంచనా 3.2 శాతంగా ఉంది.
ఆర్థిక వ్యవస్థ మరింత కుంగింది..
భారత ఆర్థిక వ్యవస్థ రెండో త్రెమాసికంలో మరింత క్షీణించిందని ఐఎంఎఫ్ తెలిపింది. వాహన రంగం, స్థిరాస్తి వంటి రంగాలలో నెలకొన్న మందమనానికి తోడు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల వృద్ధి మరింతగా క్షీణించిందని ఆయన అన్నారు. అయితే రానున్న రోజుల్లో వడ్డీరేట్ల తగ్గింపు, కార్పొరేట్ పన్ను తగ్గింపు, కార్పొరేట్ అనిశ్చితిని తొలగింపు చర్యలతో పాటుగా గ్రామీణ భారతంలో వినియోగం పెంచేలా సర్కారు తీసుకుంటున్న చర్యల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 2020లో పుంజుకొనే అవకాశం ఉందని పేర్కొంది.
వృద్ధిరేటు అంచనాల్లో 1.2% కోత..
భారత ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) దేశ వృద్ధిరేటు అంచనాలకు కోత పెట్టింది. భారత్లో అంచనా వేసినదానికంటే వేగంగా దేశీయ వినియోగం పడిపోవడంతో.. వృద్ధి క్షీణించే అవకాశం ఉందని ఐఎంఎఫ్ విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 6.1 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతకు ముందు ఏప్రిల్ మాసంలో ఐఎంఎఫ్ వెలువరించిన వృద్ధిరేటు అంచనాలకంటే కూడా ఇది 1.2 శాతం తక్కువ.. ఐఎంఎఫ్ సంస్థ తాజాగా వెల్లడించిన 'వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్' నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఐఎంఎఫ్ అంతకు ముందు ఏప్రిల్ మాసంలో భారత్ వృద్ధి అంచనాలను 0.3 శాతం మేర తగ్గించి 7.3 శాతానికి పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా దానిని మరోమారు సవరిస్తూ 6.1 శాతానికి పరిమితం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం మేర వృద్ధిని నమోదు చేసినప్పటికీ ఈ ఏడాదికి (2019).. ఇది 6.1 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు గాను ప్రభుత్వం ఇటీవల కొన్ని కీలక ప్రయత్నాలు మొదలు పెట్టిన నేపథ్యంలో వచ్చే ఏడాది (2020) భారత్ వృద్ధిరేటు పుంజుకొని 7.0 శాతానికి చేరుకునే అవకాశం ఉందని సంస్థ అభిప్రాయపడింది. గత ఆదివారం ప్రపంచ బ్యాంక్ కూడా తన 'సౌత్ ఏషియా ఎకనమిక్ ఫోకస్' నివేదికలో కూడా భారత వృద్ధి రేటు అంచనాలను సవరిస్తూ.. 6 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే.