Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి త్రైమాసికంలో భారీగా తగ్గిన రుణ డిమాండ్
- దేశంలో వినియోగం, సప్లయి తగ్గటమే కారణం..!
ముంబయి: ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు విస్తరిస్తున్న వేళ వాణిజ్య రుణాల డిమాండ్ పడిపోతూ వస్తోంది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో వాణిజ్య రుణాల డిమాండ్ గణనీయంగా 2.6 శాతం మేర కుంగి రూ.63.80 లక్షల కోట్లకు చేరుకుందని ప్రభుత్వ రంగ సంస్థ సిడ్బి, ట్రాన్స్ యూనియన్ సిబిల్ సంస్థలు జరిపిన సంయుక్త సర్వే తేల్చింది. అంతకు ముందు మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే సంస్థల ఆస్తుల నాణ్యత కూడా పడిపోయిందని సర్వే విశ్లేషించింది. వ్యవస్థలో వినియోగం తగ్గి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ సంస్థలు తమ కార్యకలాపాలను తగ్గిస్తూ వస్తున్నాయి. ఈ కారణంగా ఆయా సంస్థలు తమ ఉత్పత్తి, నిర్వహణ ఖర్చుల కోసం కొత్తగా రుణాలు తీసుకొనేందుకు ముందుకు రాకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. వాణిజ్య రుణాల విభాగంలొని మొత్తం నాలుగు సెగ్మెంట్లలో రుణాలకు డిమాండ్ పడిపోవడం కనిపించిందని సర్వే వివరించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహాతో పాటు పెద్ద కంపెనీలు కూడా వాణిజ్య రుణాలను తీసుకొవడం తగ్గించినట్టుగా ఈ సర్వే ద్వారా తేలింది. గత కొన్ని సంవత్సరాలుగా వాణిజ్య రుణాల డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తున్న నేపథ్యం లోనూ మందగమన పరిస్థితులు ముసురుకోగా.. ఇప్పుడు రుణ డిమాండ్ పడిపోవడంతో ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదం ఉందని విధానకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సూక్ష్మ, చిన్న, మధ్యతరహాతో పాటు పెద్ద కంపెనీల నిరర్థక ఆస్తులు కూడా పెరిగిపోవడంతో ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం వచ్చే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక అనిశ్చితి కారణంగ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తమ మార్కెట్ వాటాను కోల్పోయారని సర్వే తెలిపింది. అంతకు ముందు 13.7 శాతంగా ఉన్న ఎన్బీఎఫ్సీ సంస్థల మార్కెట్ వాటా 12.6 శాతానికి చేరినట్టుగా సర్వే వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, సప్లరుల తగ్గుదల వల్ల సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో బ్యాంకుల వాణిజ్య రుణ వితరణ 8.8 శాతానికి పడిపోయిందని కేర్ రేటింగ్ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవీ తెలిపారు. ఇది దాదాపు ఆరేండ్ల నాటి కనష్టిం కావడం విశేషమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కేంద్రంలోని మోడీ సర్కారు మరింత ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.