Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ బ్యాంకింగ్లో సంక్షోభపు పరిస్థితులు
- రానున్న రోజుల్లోనూ మరిన్ని సమస్యలు
- ఆర్బీఐ కూడా అప్రమత్తంగా లేదు!
- నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ హెచ్చరికలు
కోల్కతా: భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తక్షణం బ్యాంకింగ్ రంగానికి ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన ఆభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకుల్లో సమస్యలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశగా ఆర్బీఐ కూడా అంత అప్రమత్తంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఒక జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ పీఎంసీ బ్యాంకు కుంభకోణం గురించి ప్రస్తావించారు. భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగం ఎదుర్కోనున్న సమస్యలపై ఆయన తన విశ్లేషణలను అందజేశారు. చాలా కాలంగా గందరగోళ విధానాలు అవలంబించడం వల్ల ప్రస్తుతం బ్యాంకులకు ఈ దుస్థితి వచ్చిందని ఆభిప్రాయపడ్డారు. బ్యాంకులకు సరిపడా మూలధనాన్ని సమకూర్చాల్సి ఉందని అన్నారు. కానీ.. బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకునేంతగా ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదు. సంక్షోభానికి ప్రభావితమైన బ్యాంకుల అమ్మకానికి కూడా ఈ పరిస్థితి దారి తీయవచ్చని అభిప్రాయపడ్డారు. అనేక బ్యాంకులు ఆర్థిక సంక్షోభానికి ప్రభావితమ వుతున్నాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండనుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ప్రభావిత బ్యాంకులను విక్రయించి తద్వారా నిధులు సమకూర్చి, మిగతా బ్యాంకులకు ఉద్దీపన కల్గించవచ్చని అని విశ్లేషించారు. ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని సగటు వినియోగానికి సంబంధించిన గణాంకాలను వెల్లడిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ''2014-2015, 2017-2018 మధ్య సంఖ్య కొద్దిగా తగ్గిందన్న వాస్తవం మనం గుర్తించాలి. చాలా సంవత్సరాల తరువాత ఇటువంటి విషయం జరగడం ఇదే తొలిసారి. కనుక దీనిని ఒక స్పష్టమైన హెచ్చరికకు సంకేతంగా మనం భావించాలి'' అని ఆయన అన్నారు.