Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు విపక్షాలపై నిందలు వేయడం మాని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హితువుపలికారు. 'మీరు (బీజేపీ) ఐదేండ్లు పాలన సాగించారు. అయినప్పటికీ ఇంకా యూపీఏ పాలనే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు కారణమంటూ నిందలు వేయడం మానండి. ఇంకా ఐదేండ్ల సమయం ఉన్న క్రమంలో లోపాలను గుర్తించి, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టి సారించాల'ని సూచించారు. ప్రధానిగా మన్మోహన్, ఆర్బీఐ గవర్నర్గా రఘురాం రాజన్ ఉన్న సమయంలోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మన్మోహన్ పై విధంగా స్పందించారు. ముంబయిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందుగా దానిని సరిగ్గా అంచనావేసి, పరిష్కార మార్గాలను అన్వేషించాలని కేంద్రానికి సూచించారు. కేంద్రం చేసిన తప్పిదాల కారణంగా ఆయా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వివరించారు. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత మహారాష్ట్రలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని వివరించారు. అలాగే మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో రైతుల చావులు అధికమయ్యాయని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని అప్పుడే హెచ్చరించాననీ గుర్తుచేశారు. బీజేపీ అసమర్థ పాలన, సర్కారు ఉదాసీనత కారణంగా భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశమున్నదని మన్మోహన్ హెచ్చరించారు.