Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఇటీవల ఆడిటర్ల వ్యవహారశైలి వల్ల కంపెనీలు, మదుపరులు భారీగా నష్టపోతున్న అంశాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) సీరియస్గా తీసుకుంది. దీంతో తాజాగా నమోదిత కంపెనీల నుంచి ఆడిటర్లు రాజీనామా చేసి వైదొలడాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు కఠినతరం చేసింది. ఆడిటర్లు ఏ త్రైమాసికంలో రాజీనామా చేస్తున్నారో ఆ త్రైమాసికానికి సంబంధించి పూర్తి ఆడిట్ రిపోర్టులను వెల్లడించి తప్పుకోవాల్సి ఉంటుందంటూ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఒక వేళ ఏడాదిలో చివరి త్రైమాసికం తప్ప మిగిలిన వాటికి సదరు ఆడిటర్ సంతకం చేసినట్లైతే వారే వార్షిక నివేదికను కూడా ఖరారు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆడిటర్ రాజీనామాకు కారణాలను సమగ్రంగా వెల్లడించాలని పేర్కొంది. ఇక లిస్టెడ్ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు సదరు ఆడిటర్కు అవసరమైన సమాచారం ఇవ్వకపోతే ఆ విషయాన్ని కచ్చితంగా డిస్క్లైమర్లో పేర్కొనాలని కోరింది. కంపెనీల మేనేజ్మెంట్ ఒక వేళ ఆడిట్ను అస్తవ్యస్తం చేస్తే ఆడిట్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది. దీనిపై ఆడిట్ కమిటీ చర్చించి తీసుకున్న నిర్ణయాలను మేనేజ్మెంట్కు, ఆడిటర్కు వెల్లడిస్తాయి. గత ఏడాది 48 మంది ఆడిటర్లు అర్ధాంతరంగా లిస్టెడ్ కంపెనీల నుంచి వైదొలగారు. ఈ ఏడాది ఇప్పటికే 16 మంది ఆడిటర్లు కంపెనీల నుంచి వైదొలగారు. ఇలాంటి చర్యలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతున్న వేళ సెబీ ఆడిటర్ల రాజీనామా విధానాన్ని కఠినతరం చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.