Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10కి మించి మోడళ్ల విడుదలకు ప్రణాళికలు : షావోమీ
ఉజెన్(చైనా) : చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమీ 5జీ మొబైల్లతో దూసుకుపోయేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నది. వచ్చే ఏడాది 10కి మించిన 5జీ మోడళ్లను విడుదల చేసేందుకు సంస్థ సిద్ధమవుతున్నదని చీఫ్ ఎగ్జిక్యూటివ్ లెయి జున్ వెల్లడించారు. చైనా మార్కెట్లో ప్రత్యర్థి హువావే కంపనీతో పోటీ తీవ్రమైన నేపథ్యంలో లెయి జున్ ఈ మేరకు వెల్లడించారు. గతనెలలో షావోమీ తన మొట్టమొదటి 5జీ ఎనేబుల్డ్ మొబైల్ ఎంఐ 9 ప్రొను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఈ మొబైల్కు సంస్థ అంచనావేసిన దానికంటే.. ఎక్కువ అమ్ముడుపోయాయని చైనాలో ఉజెన్ పట్టణంలో నిర్వహించిన వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్లో లెయి జున్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది 10 మోడళ్లలో 5జీ మొబైల్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు వివరించారు. అధిక, మధ్యతరహా, చౌక ధరల విభాగంలోనూ ఈ మోడళ్లు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది 4జీ మొబైల్ ఫోన్లను విక్రయించలేమని ఇండిస్టీకి చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనీ, ఈ స్థితిని తప్పక ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. అలాగే, ఆపరేటర్లు 5జీ బేస్ స్టేషన్లు త్వరితగతిన విస్తరిస్తారని ఆశిస్తున్నట్టు వివరించారు. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య విభేదాలకు మూలకేంద్రంగా ఉన్న హువావే మొబైళ్లు దేశభక్తి సెంటిమెంట్తో అధికంగా అమ్ముడుపోయినట్టు సమాచారం. దీంతో చైనా మార్కెట్లో షావోమీ విక్రయాలు కొంతమేరకు క్షీణించాయి.