Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100శాతం వాటాలు విక్రయించేందుకు సర్కారు సమాయత్తం
- వచ్చే నెలలో బిడ్ల ఆహ్వానానికి రంగం సిద్ధం
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ వైమానిక సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలను అమ్మేసేందుకు మోడీ సర్కారు సిద్ధమైంది. కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ సంస్థను ప్రయివేటుపరం చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగానే 100శాతం వాటాల విక్రయానికి ప్రాథమిక బిడ్లను వచ్చే నెల ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. కొన్ని సంస్థలు ఈ వాటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయనీ వివరించాయి. ఎయిరిండియా ప్రస్తుతం దాదాపు రూ. 58వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. మొదటి నుంచీ కేంద్ర సర్కారు నిర్లక్ష్యంతో ఈ సంస్థ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఎయిరిండియాకు చెల్లించాల్సిన బకాయిలనూ కేంద్రం పెండింగ్లో వేసినట్టు కథనాలు వచ్చాయి. చివరికి నేడు ఆ సంస్థలోని పూర్తి భాగస్వామ్యాన్ని అమ్మి ప్రయివేటుపరం చేసేందుకు ప్రణాళికలు వేసింది. 100 శాతం వాటాల అమ్మకాలు ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో జరిగే అవకాశమున్నదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ-బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ వేలం జరగనున్నట్టు చెప్పాయి. గత ఆర్థిక సంవత్సరానికిగాను అకౌంట్ స్టేట్మెంట్ కోసం ఈ నెల 22న సంస్థ బోర్డు సమావేశం జరగనుంది. అయితే, ఈ సమావేశానికి ముందుగానే.. గతవారం పౌరవిమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ఎయిరిండియాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నష్టాల్లో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయివేటీకరణ ప్రతిపాదనపై యాజమాన్యం.. కార్మికుల యూనియన్లతో భేటీ అయింది. ఇందులో మెజార్టీ యూనియన్లు ఉపాధి కోల్పోతామని చెబుతూ.. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.