Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్ పతనమైతే గరిష్టంగా వచ్చేది రూ.లక్షే..!
- ఎన్ని కోట్ల డిపాజిట్లు ఉన్నా చివరికి దక్కేదింతే..
- 'స్టాంప్ కొటి' మరీ చెబుతున్న బ్యాంక్ సంస్థలు
- ఆర్బీఐ ఆదేశాలతోనే ఈ తరహా హెచ్చరికలు!
- ఖాతాదారుల్లో ముసురుకుంటున్న కొత్త భయాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై కొత్త్త ఆందోళనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా బ్యాంకుల పనితీరు బాగోలేదంటూ ఆర్బీఐ ఒకవైపు ఆంక్షలు విధిస్తూ దిద్దుబాటు చర్యలకు ఆదేశాలు జారీ చేస్తుంటే.. మరోవైపు పలు బ్యాంకుల్లో కొత్త సంక్షోభాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం 'పంజాబ్ నేషనల్ బ్యాంక్'లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మోసం రూపంలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మోసం మూలలను గుర్తించి నష్టనివారణ చర్యలు చేపడుతున్న తరుణంలో తాజాగా నీరవ్మోడీ బంధువు ఛోక్సీ పంజాబ్ సింధ్ బ్యాంకులో మరో భారీ కుంభకోణంతో కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇది ఇలా ఉండగానే మరోవైపు పంజాబ్, మహారాష్ట్ర సహకార (పీఎంఎసీ) బ్యాంక్లో పెను సంక్షోభం దేశ వ్యాప్తంగా బ్యాంక్ డిపాజిటర్లలో కలవరం రేపుతోంది. ఈ బ్యాంక్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించిన ఆర్బీఐ ఆ బ్యాంక్పై తీవ్ర ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా ఖాతాదారులు రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్డ్రా చేసుకొనే విధంగా నిబంధనలను విధించింది. ఖాతాదారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవడం, స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగి ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేయడంతో.. ఈ మొత్తాన్ని తాజాగా రూ.40,000కు పెంచుతూ పెద్ద బ్యాంక్ అనుమతులను జారీ చేసింది. ఈ సంఘటన నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కలకలం సృష్టిస్తున్న స్టాంప్ సందేశం..
ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల చేపట్టిన ఒక చర్య బ్యాంక్ ఖాతాదారుల్లో కొత్త ఆందోళనలను రేపుతోంది. ఈ బ్యాంక్ తన ఖాతాదారులకు అందిస్తున్న పాస్బుక్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక స్టాంప్ను ముద్రించి ఇస్తోంది. ఈ స్టాంప్ సారాంశం ఏంటంటే.. ''ఈ బ్యాంక్ డిపాజిట్లు డీఐసీజీసీ (డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్) వద్ద బీమా చేయబడ్డాయి. ఒక వేల బ్యాంక్లో ఇబ్బంది ఏర్పడి.. లిక్విడేషన్కు వెళితే డీఐసీజీసీ ఆయా డిపాజిటర్లకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు సొమ్మును మాత్రమే తిరిగి చెల్లింపులు చేస్తుంది. అది కూడా రెండు నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది.'' అని ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీసుకున్న స్టాంప్ నిర్ణయం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మెసేజ్ దేశ వ్యాప్తంగా ఖాతాదారుల్లో కొత్త అనుమానాలను సృష్టిస్తున్న వేళ ఆ బ్యాంక్ అధికారులు దీనిపై అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆర్బీఐ జూన్22, 2017లో విడుదల చేసిన ఒక సర్క్యూలర్ ప్రకారం చిన్న బ్యాంక్లతో సహా అన్ని బ్యాంక్లూ.. పేమెంట్ బ్యాంక్లూ డిపాజిట్ బీమా కవర్ గురించిన సమాచారాన్ని ఖాతాదారులకు అందించాల్సి ఉందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగానే ఈ విష యాన్ని అందరికీ తెలియజేసేందుకు గాను పాస్ పుస్తకా లలో ఇందుకు సంబంధించిన విషయాన్ని ప్రచురించేందుకు ప్రయత్నిస్తున్నాం. కొత్త పాస్బుక్లలో ఈ అంశం నేరుగా ప్రచురితమై వస్తుండగా.. పాత పాస్బుక్లు కలిగి ఉన్న వారికి విషయం తెలిపేందుకు గాను తాము రూ.లక్ష హామికి సంబంధించిన స్టాంప్ను ముద్రించి ఇస్తున్నట్టుగా బ్యాంక్ తెలిపింది. ఆర్బీఐ సర్క్యూలర్ ప్రకారం అన్ని బ్యాంకు లు డిపాజిట్ బీమా కవరేజ్కు సంబంధించిన సమాచారాన్ని కవరేజ్ లిమిట్ వివరాలను ఖాతాదారులకు అందించాల్సి ఉంటుంది. సమయానుకూలంగా ఇది మారుతూ ఉంటుందని. ఈ విషయం అందరికీ తెలిసేలా పాస్బుక్ ముందు భాగంగా ప్రచురించాలని పెద్దబ్యాంక్ ఆర్బీఐ అన్ని బ్యాంకులకు స్పష్టమైన నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే కొన్ని బ్యాంక్లు స్టాంప్ వ్యవహారాన్ని అమలులోకి తెస్తున్నట్టుగా సమాచారం.
డీఐసీజీసీ ఎందుకంటే..
వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంక్ ఏదైనా కారణం చేత పతనమైన నేపథ్యంలో ఖాతాదారులు భద్రపరుచుకున్న సొమ్ముకు తగిన రక్షణ కల్పించేందుకు గాను ప్రభుత్వం ఆర్బీఐ పర్యవేక్షణలో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ)ను ఏర్పాటు చేసింది. డీఐసీజీసీ బ్యాంక్ పరిధిలోకి భారత్లో పని చేస్తున్న అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు వచ్చి చేరుతాయి. భారత్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. అన్ని బ్యాంకుల్లో చేసే సాధారణ డిపాజిట్లతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లకు కూడా డీఐసీజీసీ కవర్ ఉంటుంది. ఏదైన అనుకోని సంఘటన కారణంగా బ్యాంక్ పతనమై ఆర్బీఐ సదరు బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తే.. డీఐసీజీసీ నుంచి గరిష్టంగా ఖాతాదారులకు రూ.లక్ష మాత్రమే డిపాజిట్ సొమ్ము అందనుంది. ఒక ఖాతాదారు వివిధ శాఖల్లో పలు ఖాతాలు ఉన్నప్పటికీ.. అన్ని ఖాతాల్లో సొమ్ముకు ప్రతిగా అతినికి అందేది మాత్రం రూ.లక్ష మాత్రమే. ఎన్ని లక్షలు, కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నా ఖతాదారులకు అందేంది మాత్రం గరిష్టంగా రూ. లక్ష దాటదని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ డిపాజిట్లపై ఖాతాదారుల్లో కొత్త భయాలు మొదలయ్యాయి. బ్యాంకుల్లో రోజుకో కుంభకోణం, భారీ మోసాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తమ సొమ్ముకు ఎంత వరకు భద్రత ఉందన్న అంశంపై వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.