Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ తరహా ఆలోచన అపోహ మాత్రమే
- టాక్స్కట్తో సంపన్నులకే అధిక లాభం
- పేదలకు డబ్బు చేరే మార్గాల్ని చూడండి
- డిమాండ్ పెరిగితేనే పెట్టుబడులొస్తాయి: అర్థశాస్త్ర నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ సూచన
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారత్లో డిమాండ్ పడిపోతూ వృద్ధి మందగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక దశాదిశ లేకుండా చేపడుతున్న ఉద్దీపన చర్యలను అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీ తప్పుబట్టారు. దేశంలో పన్నులను తగ్గిస్తే పెట్టుబడులు పెరుగుతాయన్నది కేవలం ఒక అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. ఇలా చేయడం వల్ల సమాజంలో సంపన్నులకే మేలు జరుగుతుంది తప్ప.. సామాన్యులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. పన్నులు తగ్గిస్తూ ప్రోత్సాహకాలను ప్రకటించడం ద్వారా సర్కారు ఇప్పటికే కోట్లాది రూపాయలు కలిగి ఉన్న సంపన్నులకు మరింతగా మేలు చేయడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో ప్రత్యక్ష పన్నులు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఎలా పెరుగగలదని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్లో సహా అన్ని అభివృద్ధి చేందుతున్న దేశాలు వృద్ధిని పెంపొందించేందుకు గాను భారీగా పన్నులను తగ్గిస్తూ వస్తున్నాయని.. అయినా వరసగా అయిదో నెలలోనూ ప్రపంచ వృద్ధిరేటు పడిపోయినట్టుగా ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పన్నులు తగ్గించడం ద్వారా వృద్ధిని పెంచలేరని.. పన్నుల రూపంలో వస్తున్న సొమ్మును వివిధ రూపాల్లో సమాజంలోని పేదలకు వచ్చి చేరేలా చర్యలు చేపడితే వ్యవస్థలోకి సొమ్ము వచ్చి చేరుతుందని సూచించారు. ప్రజల చేతుల్లోకి నగదు వస్తే వారు విరివిగా కొనుగోళ్లకు దిగుతారని.. ఫలితంగా డిమాండ్ పెరుగు తుందని ఆయన అన్నారు. పేదలకు డబ్బు చేరే మార్గాల్ని చూడాలని కోరారు. డిమాండ్ పెరిగితే లాభాలను ఆశించే కార్పొరేట్ సంస్థ లు తప్పక పెట్టుబడులతో ముందుకు రాగలరని ఆయన విశ్లేషించారు. డిమాం డ్కు అనుగుణంగానే పెట్టుబడులు వస్తుంటాయి తప్ప.. పన్నులు తగ్గిస్తే కాదని తెలిపారు. తాను రచించిన 'గుడ్ ఎకనమిక్స్ ఎట్ హార్డ్ టైమ్స్' పుస్తకం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్న బెనర్జీ పలు ఆర్థిక అంశాలపై మాట్లాడారు. భారత్లో వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలను చేపట్టడం మంచి చర్యేనని ఆయన అన్నారు. వ్యవస్థలో డిమాండ్ పెంచే ప్రక్రియను కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు చర్య చేపట్టలేదు కదా అని ఆయన ప్రశ్నించారు.
స్వల్పకాలంలో ద్రవ్బోల్బణం పెరిగితే లాభమే..
దేశంలో ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినంత మాత్రాన వ్యవస్థకు కలిగే నష్టం ఏమీ ఉండదని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం వల్ల లేబర్ డిమాండ్ పెరుగుతుందని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న తలంపుతో ఆహారోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచకుండా ఉండడం దారుణమని ఆయన అన్నారు. దీని వల్ల వ్యవసాయాధారిత దేశమైన భారత్లో మందగమన పరిస్థితులు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్న ట్రేడ్వార్ పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేయగలవని ఆయన అన్నారు. అయితే ఇందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ముందుకు సాగాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత్లో వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయని డిమాండ్ పడిపోయిన ప్రస్తుత మందగమన పరిస్థితుల్లో వీటిని సవరించడం కొంత సమస్యాత్మకమేనని ఆయన అన్నారు. భారత్ బలమైన ప్రభుత్వ రంగాన్ని కలిగి ఉందని. ఇవి మన ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే అంశమని ఆయన అన్నారు. దేశంలో మద్దతు ధరలు చాలా తక్కువగా ఉన్నాయని.. గత కొంత కాలంగా ప్రభుత్వాలు వీటిని అదే స్థాయిలో ఉంచుతూ వస్తున్నాయని అన్నారు. మందగమనంలో డిమాండ్ను పెంచే క్రమంలో మద్దతు ధరలను సవరించే విషయంలో సర్కారు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఆ తరువాత రైతులకు నష్టపరిహారం గురించి ఆలోచిస్తే మేలని ఆయన అన్నారు.