Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్నుల తగ్గిరపుతో కోల్పోయే ఆదాయాన్ని సమకూర్చేదెలా..?
- మోడీ సర్కార్కు ఐఎంఎఫ్ సీనియర్ అధికారి ప్రశ్నలు
ముంబయి: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఆర్థిక అంశాల లెక్కల పట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సీనియర్ అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక అంశాల అంకెల్లో మరింత పారదర్శకత పాటించాలంటూ మోడీ సర్కార్కు ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ అన్నేమేరీ గుల్డే చురకలంటించారు. జీ-20లోని మిగతా దేశాలతో పోలిస్తే పారదర్శకతలో భారత్ వెనకబడి ఉన్నదని ఆమె విమర్శించారు. కొన్నేండ్లుగా బడ్జెట్లో పేర్కొన్న మేరకు ద్రవ్యలోటును తగ్గించే లక్ష్యాలను అందుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమవుతున్నదని ఆమె గుర్తు చేశారు. ఆర్థిక పరిశీలనలో విశ్వసనీయతకు హామీ ఇవ్వాలని మోడీ సర్కార్కు హితవు పలికారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కార్పొరేట్ పన్నును రద్దు చేయడం వల్ల తగ్గనున్న రూ.లక్షా 45 వేల కోట్ల ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోగలరో ప్రణాళిక ఏమైనా ఉన్నదా అని ఆమె ప్రశ్నించారు. పెట్టుబడులకు ఊతమిచ్చే పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్లో కార్పొరేట్ పన్నును 35 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు మోడీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2019-20 మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5 శాతానికే పరిమితం కావడం, ఆర్థిక వ్యవస్థ మందగమనంపై విమర్శలున్న నేపథ్యంలో మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొని మరింత ఇరకాటంలో పడటం గమనార్హం. ఆర్థికశాస్త్రంలో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ కూడా కార్పొరేట్ పన్నును తగ్గించడాన్ని తప్పు పట్టిన విషయం తెలిసిందే. ద్రవ్య పారదర్శకత మెరుగుపడాలి. జీ-20లోని మిగతా దేశాలు ఈ విషయంలో ఎంతో ప్రగతిని సాధించాయని ఐఎంఎఫ్ అధికారి తెలిపారు. విశ్వసనీయ ద్రవ్య పరిశీలన వల్ల ఆర్థిక వనరులపై ప్రయివేట్ రంగానికి స్వేచ్ఛ ఏర్పడి సాపేక్షంగా అప్పుల భారం తగ్గించుకునేందుకు వీలవుతుందని ఆమె అన్నారు. 2019-20 బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.3 శాతంగా మోడీ సర్కార్ పేర్కొన్నది. కానీ, ఆదాయం తగ్గడం వల్ల ఇప్పుడది 4 శాతంకుపైగా నమోదు కానున్నట్టు ఆర్థికవేత్తల అంచనా.