Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నం వరకు సూచీలు ఫ్లాట్గా ట్రేడ్ అయినప్పటకీ 2 గంటల తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రభుత్వం ఎకనామిక్ డేటా విడుదల చేయనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తతలో వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 229 పాయింట్లు దిగజారి 40,116కు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లను నష్టపోయి 11,840 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఒకానొకసమయంలో 386 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ కూడా 11,823 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. బ్యాంక్ షేర్లలోని తీవ్ర అమ్మకాల ఒత్తిడి వల్ల సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి హెవీవెయిట్ షేర్లు పడిపోవడంతో ఇండెక్స్లు నష్టపోయాయి. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 3 శాతానికి పైగా పతనమైంది.