Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత ఆర్థిక ప్లానింగ్లో వింత ధోరణి..
- రీపేమెంట్లపై జనుకు లేకుండా రుణాలు
- ఒక అప్పు తీర్చేందుకు.. మరో కొత్త రుణాలు
- బ్యాంకులు, విత్త సంస్థల్లో ఎగవేత భయాలు
- ఆర్థిక వ్యవస్థ కొత్త తలనొప్పిగా 'మిలేనియల్స్'!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ యువతలో వినూత్న ఆర్థిక ధోరణి కనిపిస్తోంది. తాజాగా వెలువడిన ఒక నివేదిక ప్రకారం చాలా మంది యువత ముందూవెనుక చూసుకోకుండా విరివిగా అప్పులు తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులను పారదోలేందుకు బ్యాంకులు రవిరివిగా రుణాలు ఇస్తున్న నేపథ్యంలో.. యువత తమ అవసరాల కోసం విత్తసంస్థల నుంచి అందినకాడికి రుణాలను తీసుకుంటున్నారు. ట్రాన్స్యూనియన్-సిబిల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం యువత (1980 తరువాత జన్మించిన వారు) క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, కన్జుమర్ డ్యురబుల్ లోన్స్ను తీసుకొనేందుకు అమితంగా ఆకస్తి చూపుతన్నట్టుగా తెలుస్తోంది. ఈ తరహా రుణాలు తీసుకొనేందుకు పెద్దగా జామీనులు అవసరం లేకపోవడంతో.. యువత తమ అవసరాలకంటే కూడా తమ విలాసాలకు ఎక్కువగా రుణాల బాట పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రుణాలతో యువత కొత్తకొత్త మొబైల్స్, లాప్టాప్లు, ఫ్యాషన్ వస్త్రాల కొనుగోళ్లతో పాటు వివిధ రకాల పర్యటనలకు ఆసక్తి చూపుతున్నట్టుగా అధ్యయనంలో తేలింది. విశేషమేమిటంటే ఈ అప్పులు తీసుకొనేప్పుడు యువత తమ రీపేమంట్ అంశాన్ని పెద్దగా పట్టించకోవడం లేదని తెలుస్తోంది. భవిష్యత్తుపై అతి నమ్మకంతో వీరు రుణాల బాట పడుతున్నారని సమాచారం. తీరా పీకల మీదికి వస్తే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రుణ భరాన్ని తగ్గించుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నివేదిక ద్వారా తెలుస్తోంది. దీంతో బ్యాంకులకు రానున్న రోజుల్లో ఈ రుణాలు సమస్యాత్మకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్యాంకులకు తలనొప్పిగా..
గడిచిన రెండేండ్ల నుంచి విత్త సంస్థల క్రెడిట్ డిమాండ్ను నిలబెడుతున్న వర్గాల్లో యువత ప్రధానంగా ముందు నిలుస్తూ వస్తోంది. బ్యాంకింగ్ సంస్థల గణాంకాలను పరిశీలించి చూస్తే 1980 తరువాత జన్మించిన వారు (నివేదిక వీరిని మిలేనియల్స్గా లెక్కగట్టింది) తీసుకొనే రుణాలలో 58% వృద్ధి నమోదవగా.. 1980కి ముందు జన్మించిన వారు తీసుకొనే రుణాలలో కేవలం 14 శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తోందని నివేదిక తెలిపింది. బ్యాంకుల నుంచి యువత ఎక్కువగా జామీను లేని (అన్సెక్యూర్డ్) రుణాలు తీసుకుంటున్నందున రానున్న రోజుల్లో బ్యాంకులకు ఈ విభాగం నుంచి పెద్ద అపద ఎదరయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. మొండి బాకీలు పెరిగిపోతున్న తరుణంలో విత్త సంస్థలు ఎక్కువగా రిటైల్ రుణాలపై దృష్టి సారిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ సిబిల్ రేటింగ్ కలిగిన వారికి కూడా రుణాలను అంటగడుతున్నారు. దీంతో యువత తమ అప్రాధాన్యమైన అవసరాల కోసం రుణాలు తీసుకొని ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ప్రస్తుతానికి రిటైల్ రంగపు రుణాల నాణ్యత కార్పొరేట్ రుణాల కంటే మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో ఈ విభాగం నుంచి బ్యాంకులకు పెద్ద ఉపద్రవమే ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే ఇప్పటికే తీవ్ర గడ్డు పరిస్థితుల్లో మునిగి బ్యాంకులకు రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందుల రావడం తథ్యంగా కనిపిస్తోంది. మిలేనియల్స్ క్రెడిట్ అవసరాన్ని విశ్లేషించి చూస్తే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్లు, కన్జూమర్ డ్యూరెబుల్ లోన్స్ వాటా మొత్తం రుణాలలో 72 శాతంగా ఉంటోంది.
సిబిల్కు చిక్కకుండా జాగ్రత్తలు..
దేశ యువత విరివిగా అప్పులను తీసుకుంటన్నప్పటికీ తమ పరపతిని ప్రతిబింబించే సిబిల్ రేటింగ్ పడపోకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా ఈ నివేదిక తెలిపింది. చాలా మంది యువత అవసరం లేకున్నా అప్పులు చేసినప్పటికీ వాటి రీపేమెంట్ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలతో ఆయా రుణ కిస్తీలను కట్టేస్తున్నట్టుగా తేలింది. నిబంధన ప్రకారం కొత్త రుణాలను తీసుకోవాలంటే సిబిల్ రేటింగ్ సగటున 740 నుంచి 900 మధ్య ఉండాల్సి ఉంటుంది. దీనిని గమనించిన యువత ఒక విత్త సంస్థ దగ్గర తీసుకున్న రుణాలను తీర్చేందుకు ఇతర సంస్థల వద్ద కొత్త రుణాలను తీసుకొంటూ తమ రుణ పరపతి కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని నివేదిక తెలిపింది. అయితే కొందరు మాత్రం ఈ ప్రక్రియలో విఫలమై చేతులెత్తేస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్టుగా నివేదిక తెలిపింది. ఇది బ్యాంకులకు తలనొప్పిగా మారింది.