Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రవ్యలోటు పూడ్చుకొనేందుకు సర్కారు కొత్త ఆలోచన
- 26% కీలక వాటాను ప్రయివేటుకిచ్చేందుకు ప్లాన్..!
- వచ్చే వారం క్యాబినెట్ ముందుకు విక్రయ ప్రతిపాదన
- రిఫైనరీ, ఇంధన రిటైలింగ్పై భారీ ప్రభావానికి ఛాన్స్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం:
దేశంలో పన్ను ఆదాయం పడిపోతూ.. సర్కారు ద్రవ్యలోటు అంతకంతకు పెరిగిపోతున్న వేళ కేంద్రంలోని మోడీ సర్కారు ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ఆపసోపాలు పడుతోంది. పెరుగుతున్న ద్రవ్యలోటును నియంత్రించేందుకు గాను సర్కారు పాడి ఆవుల్లాంటి ప్రభుత్వ సంస్థల్లో తనకున్న కీలక వాటాను ప్రయివేటుకు విక్రయించాలని భావిస్తోంది. ఈ ఎత్తుగడతో ప్రయివేటు రంగంలో ఉన్న తమ అస్మదీయులకు మేలు చేయడంతో పాటుగా.. ద్రవ్యలోటును నియంత్రించవచ్చన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు సర్కారు దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్ సంస్థ అయిన ''ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్''లో (ఐఓసీ) కీలక వాటాను విక్రయించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఐఓసీలో ప్రస్తుతం భారత ప్రభుత్వం నేరుగా 51.5 శాతం నియంత్రిత వాటాను కలిగి ఉంది. మరో 25.9% వాటా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ చేతుల్లోనూ.. మిగతా వాటా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ మరియు ఆయిల్ ఇండియా సంస్థల వద్ద ఉంది. ఈ నేపథ్యంలో తన వాటాను 51 శాతం దిగువకు తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
అతిపెద్ద ఆయిల్ కంపెనీకే ఎసరు..!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ తన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ యూనిట్తో కలిసి దేశ వ్యాప్తంగా 11 రిఫైనరీలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ దేశంలోని మొత్తం ముడిచమురు శుద్ధికరణ సామర్థ్యంలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉంది. రిఫైనరీతో పాటు దేశంలోని మొత్తం రిఫిల్లింగ్ స్టేషన్లలో దాదాపు సగం బంకులు ఐఓసీ గొడుగు కిందే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర సంస్థలను అమ్మితే మార్కెట్ల నుంచి అంతగా స్పందన రాదని భావిస్తున్న సర్కారు.. పాడి ఆవులాంటి ఐఓసీలో వాటాను విక్రయానికి ఉంచితే మేటి స్పందన లభించి అనుకున్న సొమ్ము చేతుకొస్తుందని సర్కారు భావిస్తున్నట్టుగా సమాచారం. ఇదే ఆలోచనతో సర్కారు ఈ సంస్థలో వాటా విక్రయానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఐఓసీలో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదనల తయారీ ఇప్పటికే పూర్తయినట్టుగా సమాచారం. వచ్చే వారం జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలోని ఐఓసీలో కీలక వాటా విక్రయానికి సంబంధించి సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. సర్కారు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఐవోసీలో సర్కారు దాదాపు 26.4 శాతం వాటాను విక్రయించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ విక్రయం ద్వారా దాదాపు రూ.33,000 కోట్ల మేర నిధులను సమీకరించవచ్చన్నది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఐఓసీలో కీలక వాటాను ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ మార్గంలో జనవరిలోగా విక్రయించాలన్నది సర్కారు ప్రణాళికగా సమాచారం. ఈ వాటా విక్రయించినప్పటికీ సంస్థలో కీలక వాటా వివిధ రూపాల్లో సర్కారు చేతుల్లోనే ఉండనుందని సర్కారులోని ఆధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తూ ఐఓసీలో వాటాను విక్రయించాలన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ, రిటైలింగ్ సంస్థ అయిన ఐఓసీలో వాటా విక్రయం వల్ల రానున్న రోజుల్లో దేశ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరువు నిలుపుకొనేందుకే అమ్మకం..
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకుంటున్న వివిధ అనాలోచిత నిర్ణయాల ఫలితంగా ఖజానాకు పన్ను ఆదాయం అంతకంతకు పడిపోతూ వస్తోంది. దీంతో ద్రవ్యలోటు పెరిగిపోయి సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు తన పరువు నిలుపుకొనేందుకే మేటి సంస్థల్లో వాటా విక్రయం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్లో సర్కారు ద్రవ్యలోటు గరిష్టావధిని జీడీపీలో 3.3 శాతంగా నిర్దేశించుకుంది. అయితే సర్కారు తన ఖర్చును తగ్గించుకొనే దిశగా చర్యలు తీసుకోకపోవడం, మందగమనం కారణంగా ద్రవ్యలోటు దాదాపు అంచనా వేసిన స్థాయికి చేరువైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా ఐదు నెలల కాలం మిగిలి ఉంది. ఈనేపథ్యంలో లోటు మరింతగా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సర్కారు తన వ్యయాలకు అవసరమైన నిధుల కోసం ద్రవ్యలోటను తగ్గించుకొనేందుకు గాను కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను విక్రయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివిధ సంస్థల్లో డిజిన్వెష్ట్మెంట్ ద్వారా దాదాపు రూ.1.05 లక్షల కోట్ల మేర నిధులను సమీకరించాలని మోడీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. ఈ లక్ష్యాన్ని అందుకొనేందుకు గాను లాభాల్లో ఉన్న ఆకర్షణీయమైన ప్రభుత్వ కంపెనీల్లో వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇందుకు గాను సర్కారు ఇండియన్ ఆయిల్తో పాటు ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్ ఇండియా వంటి సంస్థలను ఎంపిక చేసి పెట్టుకుంది. వాటా విక్రయ ప్రక్రియలో భాగంగానే భారత్ పెట్రోలియం కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించి కూడా వచ్చే వారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో సర్కారు ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం.