Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్తుపై తీవ్ర బెంగతో వెనుకడుగు
- సామాన్యులపై మందగమన ప్రభావం
- దేశంలో భారీగా తగ్గుతున్నవినియోగపు డిమాండ్
- పీఎఫ్సీఈ అంచనాల్ని తగ్గించుకున్న భారతీయ రిజర్వు బ్యాంక్
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న మందగమన పరిస్థితులు సామాన్య మానవుల జీవితాలను కూడా గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత కారణం గా.. నగదు లభ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రజలు గతంలో మాదిరిగా వస్తుసేవలపై ఖర్చు చేసేందుకు జంకు తున్నారు. అవసరమైన వస్తు, సేవలు తప్ప ఇతర ఖర్చుల వైపు ఆలోచించేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో వస్తు, సేవలపై వ్యయాన్ని భారీగా కుందించేసుకుంటున్నారు. రోజువారీగా చేస్తున్న ఖర్చులు విషయంలోనూ వారు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో తాము వస్తుసేవల నిమిత్తం అధికంగా ఖర్చు చేసేస్తున్నామే మో..! ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక పరమైన సమస్యలు వెల్లువెత్తుతాయేమోనన్న! భావన ప్రజల్లో కనిపిస్తోందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వెలువరిం చిన ఒక సర్వే నివేదిక తెలిపింది. కన్జూమర్ డ్యూరెబుల్స్ ఉత్పత్తిలో తగ్గుదల ప్రాతిపదికగా విశ్లేషించి చూస్తే.. ప్రజలు వ్యయాన్ని భారీగా తగ్గించుకుంటున్నట్టుగా తెలుస్తోందని ఆర్బీఐ సర్వే తెలిపింది. ఈ కారణంగా డిమాండ్ అంతకంతకు పడిపోతూ వస్తున్నట్టుగా ఆర్బీఐ తెలిపింది.
పీఎఫ్సీఈ అంచనాలు తగ్గింపు
దేశంలో వినయోగ డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో పెద్ద బ్యాంక్ ''రియల్ ప్రయివేట్ ఫైనల్ కన్జప్షన్ ఎక్సెపెండీచర్'' (పీఎఫ్సీఈ) వృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ పీఎఫ్సీపీ అంచనాలను 250 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అంతకు ముందు మే మాసంలో పీఎఫ్సీఈని 8 శాతంగా అంచనా కట్టిన ఆర్బీఐ.. సెప్టెంబరు మాసాంతానికి దీనిని 5.5 శాతానికి కుదించింది. దీనికి సంబంధించి ఆర్బీఐ ఇటీవల తన నెలవారీ బులిటెన్ను విడుదల చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్- ఆగస్టు మధ్య కాలంలో భారతలో మూలధన వస్తువుల ఉత్పత్తి దాదాపు 8 శాతం మేర పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పరిశ్రమల వ్యయం తగ్గిందనడానికి సూచన అని బులిటెన్ వెల్లడించింది. వినయోగ డిమాండ్ పడిపోతున్న వేళ పరిశ్రమలు కూడా తమ వ్యయాన్ని తగ్గిస్తూ వస్తున్నాయని.. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఒకరకమైన మందగమన పరిస్థితులు వృద్ధి చెందుతన్నాయని ఆర్బీఐ విశ్లేషించింది. అయితే 2020-21 మధ్య కాలంలో పీఎఫ్సీఈ 7 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా కట్టంది. అంతకు ముందు ఆర్బీఐ మార్చి నెలలో దేశ పీఎఫ్సీఈ 8.1 శాతంగా ఉండవచ్చని అంచనా కట్టిన సంగతి తెలిసిందే. అయితే మందగమనం క్రమంగా ముదురుతున్న వేళ మే మాసం విశ్లేషణలో దీనిని 8 శాతానికి తగ్గించింది. జులైలో దీనిని మరింతగా కుదించి 7.6 శాతానికి పరిమితం చేసింది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ పీఎఫ్సీఈని ప్రతినెలా సమీక్షిస్తూ వస్తుంది. దేశంలోని ప్రతి కుటుంబం, లాభాపేక్ష లేని సంస్థలు, దేవాలయాలు, గురుద్వారాలు వంటి ప్రార్థనా మందిరాల వ్యయాలను కూడా పరిగణనలోకీ తీసుకొని సర్కారు పీఎఫ్సీఈని లెక్కిస్తుంటారు. ఇదే సమయంలో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్సీఎఫ్) వృద్ధి రేటును కూడా ఆర్బీఐ 7.6 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. తాజా అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ సగటున 6.2 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చని తన సెప్టెంబరు అంచనాల్లో ఆర్బీఐ లెక్కగట్టింది. అంతకు ముందు ఇది 6.9 శాతం దరిదాపుల్లో ఉండొచ్చని పెద్ద బ్యాంక్ అంచనాకట్టింది. 2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7 శాతం మేర అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపింది. ఏదిఏమైన దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అర్థిక మందగమన పరిస్థితులు సామాన్యుల జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్నట్టుగా ఆర్బీఐ సర్వే ద్వారా తెలుస్తోంది.