Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిరిండియా, బీపీసీఎల్ విక్రయంపై నిర్మలా సీతారామన్
- వచ్చే నెల నుంచి బిడ్ల ఆహ్వానం!
- ఎయిరిండియాకు ఐదేండ్ల గడువివ్వాలన్న సూచనలు బేఖాతరు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వరంగ సంస్థలు ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లను అమ్మేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చిలోపు ఈ రెండు సంస్థలను విక్రయించగలమని ఆశిస్తున్నట్టు వివరించారు. డిసెంబర్లో ఈ రెండు సంస్థల్లోని వాటాలు విక్రయించేందుకు బిడ్ల ఆహ్వానానికి ప్రణాళికలు వేస్తున్నట్టు సమాచారం. గతేడాది ఎయిరిండియా వాటాల అమ్మకానికి మదుపరులు ఆసక్తి చూపకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా వాటాల అమ్మకానికి ఇన్వెస్టర్లు సంసిద్ధత చూపుతున్నారని తాజాగా నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించడం గమనార్హం. మదుపరులను ఆకర్షించేందుకు మోడీ సర్కారు ఇంగ్లండ్, సింగపూర్ లాంటిచోట్ల రోడ్షోలు నిర్వహించబోతున్నది.
ఆ లోటు పూడ్చుకునేందుకే..?
ఆర్థిక వ్యవస్థలో మందగమనంతో డిమాండ్ క్షీణించి కొనుగోళ్లు కుంటుపడిన విషయం తెలిసిందే. దీంతోపాటు కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు మందగించాయి. అదీగాకుండా, మోడీ సర్కారు.. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల తాయిలాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ప్రభుత్వరంగ సంస్థలు ముఖ్యంగా బ్రౌన్ఫీల్డు సంస్థల నిర్వహణ సర్కారుకు భారంగా మారిందని నిటి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఇటీవలే వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగంగా చేపడుతున్నట్టు తెలపడం గమనార్హం. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వసంస్థల నుంచి వాటాలను విక్రయించి లేదా, సంస్థలనే అమ్మేసి లక్ష కోట్ల రూపాయలను ఖజానాలో వేసుకోవాలని సర్కారు టార్గెట్ పెట్టుకున్నది. ఈ నేపథ్యంలోనే అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా, బీపీసీఎల్ సంస్థలను 2020 మార్చి కల్లా అమ్మేసేందుకు పక్కా ప్రణాళికలు వేస్తున్నట్టు కేంద్ర మంత్రి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పార్లమెంటరీ ప్యానెల్ సూచనలు గాలికి..
దాదాపు 55వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఎయిరిండియా వచ్చే ఏడాది నుంచి లాభాలబాట పట్టే అవకాశమున్నదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంస్థపట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనీ, అది చెల్లించాల్సిన బకాయిలూ పెండింగ్లోనే ఉంచిందని వివరించారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ సంస్థ భవిష్యత్లో లాభాలు కురిపిస్తుందని దృఢంగా అభిప్రాయపడ్డారు. అదీగాక, ఎయిరిండియా అప్పుల నుంచి బయటపడి నిలదొక్కుకునేందుకు ఆ సంస్థకు ఐదేండ్ల సమయాన్ని అవకాశంగా ఇవ్వాలని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి సూచించింది. కానీ, ఈ మార్గదర్శకాలను తుంగలో తొక్కిన మోడీ సర్కారు గతేడాదే ఎయిరిండియాలో 76 శాతం వాటాల విక్రయానికి ప్రయత్నించి విఫలమైంది. ఇదిలా ఉండగా.. బీపీసీఎల్లో సర్కారుకు 53.29 శాతం వాటా ఉన్నది. ఈ మొత్తం వాటాను మార్చిలోపు అమ్మేందుకు కేంద్రం సిద్ధమైంది.