Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖరీదైన రోల్స్-రాయిస్ విక్రయాల్లో 25 శాతం వృద్ధి
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఓ వైపు తీవ్ర మాంద్యంలోకి జారిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటుంటే.. మరోవైపు ధనవంతులు కొనుగోలు చేసే అత్యంత లగ్జరీ కార్లకు డిమాండ్ పెరగడం గమనార్హం. 2018 ఏడాదితో పోల్చితే 2019లో రోల్స్-రాయిస్ ప్రపంచ వ్యాప్త విక్రయాలు 25 శాతం పెరిగాయి. బిఎండబ్ల్యు గ్రూపులో భాగమైన ఈ కంపెనీ గతే డాది 50 దేశాల్లో రికార్డు స్థాయిలో 5,152 వాహనాలను విక్రయించింది. ఇది ఆ కంపెనీ 116 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద పెరుగుదల కావడం విశేషం. 2018లో ఈ కంపెనీ 4,107 యూనిట్ల అమ్మకాలు చేసింది. కాగా గతేడాది భారత్లో ఈ కంపెనీ ఎన్ని వాహనాలను విక్రయించిందనేది ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే 25 నుంచి 30 వాహన అమ్మకాలు చేసి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్లో రోల్స్-రాయిస్ మోడల్ కార్ల ధరలు రూ.6.21 కోట్ల నుంచి రూ.11.35 కోట్ల మేర ఉన్నాయి. గ్లోబల్ అమ్మకాలపై ఆ కంపెనీ రసిఇఒ ముల్లెర్-ఒటవ్వొస్ మాట్లాడుతూ ఇంతక్రితం ఎప్పుడూ లేని విధంగా గతేడాది విక్రయాలు జరిగాయని అన్నారు. ఈ ఫలితాల పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని.. కంపెనీ బ్రాండ్ పట్ల తమ ఖాతాదారుల విశ్వాసాలను కాపాడుతామన్నారు. 2019లో రష్యా, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, ఖాతర్, కొరియాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు చేసినట్టు కంపెనీ తెలిపింది.