Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధి పడిపోవడంతో పరిస్థితి దారుణం
- ఆటోమొబైల్ రంగంలో అత్యధికంగా జాబ్లాస్
- 3 నెలల్లో దాదాపు అర లక్ష వరకు జాబ్స్ కట్
- ఐటీ, స్థిరాస్తి రంగాల్లోనూ తీవ్ర కల్లోల పరిస్థితులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మందగమన పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో దేశంలో ఉద్యోగ కోతలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో డిమాండ్ తగ్గడంతో ఆయా పరిశ్రమల అమ్మకాలు కుదేలవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా పరిశ్రమల వారు ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలిపివేయడం వంటి చర్యలకు దిగుతున్నారు. ఉత్పత్తి తగ్గించుకుంటున్న కంపెనీలు, పరిశ్రమల వారు తమ నిర్వహణ భారాన్ని తగ్గించుకొనేందుకు గాను ఉద్యోగులను ఇంటికి పంపించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నాయి. దీంతో వేల సంఖ్యలో కొలువులు కొండెక్కుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా నిలిచే ఆటోమొబైల్, స్థిరాస్తి, ఐటీ, విత్త సంస్థల విభాగంలో భారీగా ఉద్యోగ కోతలు నమోదు అవుతూ వస్తున్నాయి.
ఆటో రంగంలో మరీ దారుణం..
డిసెంబరుతో ముగిసిన సంవత్సరంలో దేశంలో ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు దాదాపు 12.75 శాతం మేర పడిపోయి 29,62,052గా నమోదయ్యాయి. ఇది దాదాపు రెండు దశాబ్దాల కనిష్టం కావడం విశేషం. నిర్వహణ వ్యయాలు పెరిగి వాహన ధరలు పెరగడం, బండ్లు కొనేందుకు గతంలో అందుబాటులో ఉన్న విధంగా బ్యాంకింగేతర విత్త సంస్థల నుంచి విరివిగా రుణాలు లభించకపోవడం, రుణాల జారీ విషయంలో బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలత కారణంగా ప్రజలు ఎక్కువగా కొత్త బండ్లను కొనేందుకు మక్కువ చూపకపోవడం తదితరాల కారణంగా వాహన అమ్మకాలు గణనీయంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. దీంతో ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలతో పాటుగా వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా గణనీయంగా తగ్గాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించిన తాజా గణానంకాల మేరకు దేశంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు దాదాపు15 శాతం మేర పడిపోయి.. 8,54,759గా నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 16 శాతం వరకు కుంగాయి. దీంతో ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగ కోతలు జోరందుకున్నాయి. తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలంలో దాదాపు 15000 మందికి పైగా ఆటోమొబైల్ రంగం నుంచి ఉద్వాసనకు గురైనట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు ఆటోమొబైల్ పరిశ్రమలకు అనుబంధ పరిశ్రమలుగా ఉండే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అనుబంధ పరిశ్రమల్లో ఉపాధి కోల్పోయిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే దాదాపు ఉద్యోగ కోతలు అర లక్షల దాటేసి ఉంటుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ముందు 19 నెలల్లో దాదాపు 300 డీలర్షిప్లు మూతపడ్డాయి. వీటిల్లో కూడా దాదాపు పదివేల వరకు జాబ్స్ కొండెక్కినట్టుగా తెలుస్తోంది.
ఓయోలో భారీగా ఉద్యోగ కోతలు..
మందగమనంతో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఓయో హౌటల్స్ సంస్థ భారీగా ఉద్యోగాల కోతలకు పాల్పడుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ సంస్థ భారత్లో దాదాపు 10,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. ఇందులో దాదాపు దాదాపు 12 శాత మంది ఉద్యోగులను సంస్థ డిస్మిస్ చేసే పనులను మొదలు పెట్టింది. దీనికి తోడు రానున్న మూడు, నాలుగు నెలల కాలంలో మరో 1200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని కూడా సంస్థ నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆతిథ్య రంగంలో ప్రముఖంగా నిలిచే ఓయోలో ఉద్యోగ కోతలు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు ప్రత్యక్ష నిదర్శనమని.. ఇలా చాలా హౌటల్స్లో ఉద్యోగాల తీసివేత భారీగా సాగుతున్నట్టుగా పరిశ్రమ వర్గాల వారు చెబుతున్నారు. మందగమనం కారణంగా ఆతిథ్య రంగంలో ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య దాదాపు అయిదు లక్షలకు పైబడే ఉంటుంది. దీనికి తోడు బ్యాంకులు గతంలో మాదిరిగా రుణాలను జారీ చేయలేకపోతున్నాయి. ఫలితంగా చాలా చిన్న సంస్థలు నిర్వహణ మూలధనం లేక మూత పడుతున్నాయి. ఈ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటే గడిచిన మూడు నెలల్లో గణనీయంగా జాబ్లాస్లు నమోదు అయ్యాయి.
ఐటీ రంగంలోనూ ఆగమాగమే..
మందగమనం కారణంగా దేశ ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా పలు కంపెనీల వారు ప్రాజెక్టులు లేక బెంచ్పై ఉన్న వారే లక్ష్యంగా ఉద్యోగ కోతలకు దిగుతున్నాయి. కొన్ని కంపెనీలైతే సీనియర్, మిడ్ లెవల్ అధికారులు లక్ష్యంగా ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నారు. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ దాదాపు 7000 మందిని ఇంటికి పంపేందుకు గాను రంగం సిద్ధం చేసింది. ఈ సంస్థ ఇప్పటికే దశల వారీగా దాదాపు 6000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన సంగతి తెలిసిందే. ఐటీకి తోడు స్థిరాస్తి రంగంలోకూ వేలల్లో కొలువుల కోతలు ఉంటున్నాయి. గృహ ప్రాజెక్టుల అమ్మకాలు నిలిచిపోవడం కొత్త ప్రాజెక్టులు ఆగిపోయిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులను ఇంటికి పంపిచేస్తున్నాయి. ఈ రంగంలో స్తబద్ద కారణంగా గడిచిన మూడు నెలల కాలంలో దాదాపు 20,000 మంది కొలువులు కోల్పోయారని నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే ఇది ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య మాత్రమేనని.. పరోక్షంగా కొలువులు నష్టపోయిన వారిని కూడా లెక్కలోకి తీసుకుంటే దాదాపు ఈ సంఖ్య లక్షల దాటేసే అవకాశం ఉందని ఈ రంగంలోని విశ్లేషకులు చెబుతున్నారు.