Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి కార్పొరేట్లతో ప్రధాని సమావేశాలు
- బడ్జెట్ వేళ.. ఎడతెగని మీటింగ్లు
- ఆర్థికమంత్రి లేకుండానే...
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికని ప్రధాని మోడీ కార్పొరేట్లతో ఎడతెగని సమావేశాలు నిర్వహిస్తున్నారు. బడ్జెట్ వేళ తన కార్పొరేట్ మిత్రులతో చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఆ సమావేశాలకు మోడీ మిత్రులు అంబానీ, అదానీలతో పాటుగా రతన్ టాటా, భారతీ మిట్టల్, ఆనంద్ మహీంద్రా, అనిల్ అగర్వాల్ వంటి వారే గాక దేశవ్యాప్తంగా 120 మంది సీఈవోలతో సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయిన నేపథ్యంలో.. ఆర్థిక మందగమనంలో కార్పొరేట్ల పాత్ర కూడా ఉన్నదని ఆర్థిన నిపుణులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ సర్కారు.. తిరిగి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి వారినే సలహాలు అడగటం విడ్డూరమని వారు విమర్శలు చేస్తున్నారు. నీరవ్ మోడీ, విజరు మాల్యా వంటి వారే గాక దేశంలో ఉన్న టాప్-50 కార్పొరేట్లలో చాలా మంది బ్యాంకుల వద్ద కోటానుకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారేనని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే మోడీ సర్కారు దృష్టిలో వారే (కార్పొరేట్లు) 'సంపద సృష్టికర్తలు' కావడంతో.. ఆయన కూడా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పని వారికి అప్పగించారని వారు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, మోడీ నిర్వహిస్తున్న సమావేశాలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం లేకపోవడం గమనార్హం.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతోనే ఆర్థిక వ్యవస్థ పతనానికి పూనుకున్నా.. దాని ప్రభావం గతేడాది నుంచే తీవ్రతరమైంది. ఫలితంగా నిర్మాణ, తయారీ, ఆటోమొబైల్ వంటి రంగాలు తీవ్ర కుదుపునుకు గురయ్యాయి. గతేడాది బడ్జెట్లో జీడీపీ వృద్ధిరేటు 7 శాతం నమోదవుతుందని సర్కారు అంచనా వేసింది. కానీ, మందగమనం నేపథ్యంలో ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం అది 5 శాతానికి (పదకొండేండ్ల కనిష్టానికి) మించేలా లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో తయరీ రంగం 2 శాతం కంటే వృద్ధి రేటు నమోదుకాదని గణాంకాలు చెబుతున్నాయి. 2005-06 తర్వాత ఇంత తక్కువస్థాయి నమోదవడం ఇదే ప్రథమం. నిర్మాణరంగంలోనూ వృద్ధిరేటు 3.2 శాతానికి మించదని (ఆరేండ్ల కనిష్టం) ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ రెండు రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఊడి ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వీటన్నింటితో పాటు ప్రజల వినిమయ శక్తి కూడా భారీగా తగ్గింది.
మందగమనం నేపథ్యంలో ప్రజల వినిమయ శక్తిని పెంచాల్సిన సర్కారు.. కార్పొరేట్లకే తాయిలాలు ప్రకటించింది. వారికే పన్నులు తగ్గించి ప్రోత్సహకాలు పెంచింది. అయినా కూడా గతేడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో కార్పొరేట్ వసూళ్లు పెరగలేదు. మరోవైపు పెట్టుబడులు రాక దేశంలో ఉపాధిరంగం అడుగంటింది. ఈ ఆర్థిక ఏడాదిలో పెట్టుబడుల వృద్ధిరేటు ఒక్క శాతానికి మించలేదు. 2004-05 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో పెట్టుబడులు నమోదవడం ఇదే ప్రథమం. 2008-09 మాంద్యంలోనూ పెట్టుబడులు మందగించలేదు. ప్రజల వినిమయ శక్తి తగ్గడంతో పెట్టుబడిదారులు సైతం దేశంలో పెట్టుబడులు పెట్టడంలో వెనుకాడుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం భారీగా వ్యయాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నది. కాగ్ ఇటీవలే వెలువరించిన నివేదిక ప్రకారం.. కేంద్రప్రభుత్వం ఈసారి ఖర్చులను తగ్గించుకునే అవకాశాలున్నాయనీ, తద్వారా సంక్షేమ పథకాలకు కోత విధించనున్నట్టు తేలింది. తదనుగుణంగా మోడీ సర్కారు వచ్చే బడ్జెట్లో రూ. 2 లక్షల కోట్లను తగ్గించుకోనున్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.