Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయిదు శాతం వృద్ధి భారత్కు సరిపోదు
- నవ ఉద్యోగ కల్పన దిశగా సంస్కరణలుండాలి:
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ: తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గాను కేంద్రంలోని మోడీ సర్కారు నిర్మాణాత్మక సంస్కరణలతో ముం దుకు రావాలని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. సోమవారం ఆయన సీఎన్బీఐ-టీవీ18కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సర్కారుకు పలు సూచనలు చేశారు. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నంలో సర్కారు పెద్దలకు మేలు చేసేలా సంస్కరణలు చేపట్టడం తగదని ఆయన పరోక్షంగా సూచించారు. రానున్న బడ్జెట్లోనైనా ప్రభుత్వం గ్రామీణ భారతంలో డిమాండ్ను పెంచే దిశగా చర్యలు చేపడితే మేలని ఆయన సూచించారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామీణ భారతంలోని ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా డిమండ్ భారీగా పడిపోతున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోందని.. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో తక్షణం వివిధ మౌలిక ప్రాజెక్టులను చేపట్టాలని ఆయన సూచించారు. ఇలా చేయడం వల్ల అక్కడి వారికి విరివిగా నగదు అందుబాటులోకి వచ్చి వారు వ్యయానికి మొగ్గుచూపే అవకాశం పెరుగుతుందన్నారు. ఇలా చేయడం వల్ల స్తబ్ధుగా ఉనÊ ఆర్థిక వ్యవస్థలో గమనం మొదలవుతుందని ఆయన సూచించారు. ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా రోడ్లు, నగదు బదిలీకి సంబంధించిన పథకాల అమలు వేగాన్ని పెంచాలని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు గాను సర్కారు మధ్యతరహా ప్రణాళికతో ముందుకు రావొచ్చని తాను భావిస్తున్నామన్నారు. 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా మేటిగా మారిపోతుందని తాను భావించడం లేదని.. అయితే 2019 కంటే కూడా ఈ ఏడాది కొంత మెరుగైన పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచే విషయంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం తగదని ఆయన అన్నారు.
ఉద్యోగాల కల్పనతో కూడిన వృద్ధి కావాలి..
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ 5 శాతం దరిదాపుల్లో నమోదు చేస్తున్న వృద్ధిరేటు భారత్కు ఏమాత్రం సరిపోదని రాజన్ అన్నారు. దేశంలోని విద్యావంతులైన యువత ప్రతి ఏడాది భారీగా మన ఆర్థిక వ్యవస్థలోకి ఉద్యోగాల కోసం వస్తున్నారని ఆయన అన్నారు. వీరి అవసరాలను తీర్చేందుకు గాను 5 శాతం మేర వృద్ధి ఏమాత్రం సరిపోదని ఆయన అన్నారు. వీరందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు గాను 5 శాతం కంటే ఎక్కువ వృద్ధిరేటు అవసరమని.. ఈ దిశగా సర్కారు, విధానకర్తలు పని చేయాలని ఆయన సూచించారు. ఉద్యోగ కల్పనతో కూడిన విధానాలను తీసుకు వచ్చే దిశగా ప్రయత్నాలు జరగాలని ఆయన అన్నారు. 2013 నుంచి 2016 వరుకు ఆర్బీఐ గవర్నర్గా పని చేసిన రాజన్ దేశంలో సంస్కరణల వేగం గణనీయంగా తగ్గిందని అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి కార్యాలయం కేంద్రంగా దేశంలో విధానపరమైన నిర్ణయాలు జరుగుతుండడం, మంత్రులకు అధికారాలు లేకపోవడపై ఆయన ఇటీవల విస్మయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.