Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందగమనంలో గరిష్ట లబ్ధికి ప్రయత్నాలు
- రాయితీలిస్తే దేశానికి మేలంటూ ప్రచారం
- తాయిలాలు పొందేలా సర్కారుపై ఒత్తిడి
- గంగిరెద్దులా ప్రభుత్వ వ్యవహార తీరు...!
- వాస్తవాలను పట్టించుకోని మోడీ సర్కారు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మందగమన పరిస్థితులు ముదిరి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లోకి జారుకుంటున్న తరుణంలోనూ.. దేశాన్ని నిలబెట్టే దిశగా కార్పొరేట్ సంస్థలు కనీస బాధ్యతగా వ్యవహరించడం లేదు. కేవలం లాభాలే లక్ష్యంగా పనిచేసే కార్పొరేట్ సంస్థలు దేశంలో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో తమ ఉత్పత్తిని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. తమ మార్జిన్లు ప్రభావితం అవుతున్నాయని దీంతో చేసేది లేక వ్యయ నియంత్రణ చర్యలకు దిగుతున్నట్టుగా ఆయా సంస్థలు చెబుతున్నాయి. ఇదే సాకుతో వేలాది మంది ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించేస్తున్నాయి. ఈ చర్యలతో ఆయా సంస్థల్లో ప్రత్యక్షంగా పనిచేసే ఉద్యోగులతో పాటు.. ఆయా సంస్థలకు అనుబంధ సంస్థల్లో పనిచేసే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలలోని వారు కూడా తమ ఉపాధిని కోల్పోతున్నారు. ఫలితంగా వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న కంపెనీలు ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థికాన్ని నిలబెట్టేందుకు గాను బాధ్యతగా ఏమాత్రం ముందుకు రావడం లేదు సరికదా.. ఈ పరిస్థితులనే బూచిగా చూపి సర్కారు నుంచి గరిష్టంగా తాయిలాలను కొట్టేసే ప్రయత్నాలను ముమ్మరం చేయడం కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మంచి జోష్ను కనబరుస్తూ ముందుకు పరుగులు పెట్టిన సమయంలో వేలాది కొట్ల రూపాయల లాభాలను తమ జేబులో వేసుకున్న కార్పొరేట్ సంస్థలు గత 12 నుంచి 18 నెలల కాలంగా ఎదురువుతున్న ప్రతికూల పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నాయి. బేరాలు లేక లాభాలు రాకపోతే ఇక్కడ పెట్టుబడులు పెట్టడం దండుగా అనే భావనతో కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. ఫలితంగా ఉత్పత్తి కార్యకలాపాలు మందగించి ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. దీంతో ఆర్థిక చట్రం క్రమంగా మరింత మందిగిస్తూ వస్తోంది. ఇన్నాళ్లు వేలకోట్ల రూపాయల లాభాలను తమ బొక్కాసంలో నింపుకున్న సంస్థలు.. స్వల్పకాలంలో ఎదురవుతున్న ప్రతికూలతను అధిగమించేలా చర్యలు చూపేందుకు ముందుకు రావడం లేదు. ఇన్నాళ్లు ఆయా సంస్థలు సంపాదించుకున్న మొత్తంలో కనీసం 10 శాతం సొమ్మును ఇప్పుడు దేశ విశాల ఆర్థిక ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని తాజా పెట్టుబడిగా ముందుకు తీసుకువస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కుతుందని మేధావులు చెబుతున్నారు. ఆర్థిక శాస్త్రంలో నొబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ కూడా ఇటీవల ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దశాబ్దా కాలంగా మేటి లాభాలే..
2008-09 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన మాంద్యం ప్రభావంతో కొంత ప్రభావితమైనట్టు కనిపించిన కంపెనీలు ఆ తరువాత నుంచి వరుసగా లాభాలను ఆర్జిస్తూనే వస్తున్నాయి. 2009 నుంచి 2018 వరకు అంటే దాదాపు దశాబ్ద కాలంలో దాదాపు అన్ని ప్రధాన రంగాలలోని పరిశ్రమలు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, టెక్స్టైల్స్, మౌలికం, టెలికాం, ఎలక్ట్రానిక్స్, ఇంధనం, ముడిచమురు తదితర ప్రధాన రంగాలలోని కార్పొరేట్ సంస్థలు విశేషమైన లాభాలను ఆర్జించాయి. కొన్ని రంగాలైతే కనీవిని ఎరగని రీతిలో లాభాలను నమోదు చేశాయి. గడిచిన పదేండ్ల కాలంలో కార్పొరేట్ సంస్థల లాభాలు-జీడీపీ నిష్పత్తి 7.8 శాతం నుంచి దాదాపు 3 శాతం మధ్య నమోదు అవుతూ వచ్చింది. గడిచిన ఐదేండ్ల కాలంలో నిఫ్ట్టీ-500లోని కంపెనీల లాభాలను విశ్లేషించి చూస్తే కంపెనీలు ఆయా కంపెనీల మొత్తం లాభం సగటున దాదాపు రూ.4 నుంచి 4.8 లక్షల కోట్లుగా నమోదైందని మోతీలాల్ ఓజ్వాల్ వెల్లడించిన ఒక నివేదిక తెలిపింది.
అన్నింటికీ' సై' కొడుతున్న సర్కారు
ఆర్థిక వ్యవస్థలోని ప్రతికూల పరిస్థితులను ఆసరాగా చేసుకొన్ని వీలైనంత గరిష్టస్థాయిలో లబ్ది పొందాలని కార్పొరేట్ సంస్థలు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దేశంలో ఉత్పత్తి కార్యక్రమాలు స్తంభించడం ఉద్యోగాలు గాలిలో కలుస్తుండడాన్ని ఈ సంస్థలు ప్రధానంగా ఎత్తిచూపుతూ తమ రంగంలోని పరిశ్రమలకు లక్షల కోట్ల తాయిలాలను ప్రకటించాలని సర్కారును కోరుతన్నాయి. ఇలా చేస్తేనే తమ రంగానికి మేలు జరుగుతుందని.. లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని కొలువులు కొండెక్కుతాయన్న ధోరణిలో ప్రయివేటు అధ్యయన నివేదికలను వెల్లడిస్తూ సర్కారుపై ఒత్తిడిని తెస్తున్నాయి. వీటి ఆధారంగా కార్పొరేట్ సంస్థలు సర్కారుపై లాబీయింగ్ కూడా జరుపుతున్నాయి. తాము పూర్తిగా ప్రయివేటుకు అనుకూలమంటూ స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీయే ప్రకటనలు చేస్తుడడంతో ఈ అనుకూలతను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు గాను కార్పొరేట్లు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయి. తమకు రాయితీలిస్తే కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఫలితంగా ఆర్థిక రంగానికి మేలు జరగుతుందన్నట్టుగా సీన్ను తర్చిదిద్దే ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రయివేటుకు అనుకూలమైన సర్కారు ఈ దిశగా కార్పొరేట్ సంస్థలు ఆశిస్తున్న సంస్కరణలకు గంగిరెద్దులా తలూపుతోంది. ఫలితంగా ఖజానాకు లక్షల కోట్లమేర నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు వస్తున్న లాభాలనైనా ప్రజలకు, ఆర్థిక వ్యవస్థ మేలుకు ఖర్చు చేయాల్సిన కార్పొరేట్ సంస్థలు అందినకాడికి తమ జేబుల్లో వేసుకొని.. మరోమార్గంలో ఖజానాను ఎలా కొల్లగొట్టాలనే యత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణం ఇటీవల సర్కారు కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించడమే. సర్కారు చర్య కారణంగా కార్పొరేట్ సంస్థలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కలుపుకొని దాదాపు రూ.రెండ్లు కోట్ల మేర లబ్ధి కలుగుతున్నట్టుగా నివేదికల ద్వారా తెలుస్తోంది. కార్పొరేట్ ట్యాక్స్ కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఇప్పటి వరకు ఒనగూరిన ప్రయోజనం ప్రత్యక్ష లేదా పరోక్షంగా ఒక్కటికూడా లేదని చెప్పవచ్చని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు బదులుగా.. ఆ సొమ్మును గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెంచేందుకు వినియోగిస్తే ఆర్థిక వ్యవస్థకు కొంతమేర మేలు జరిగేదని వారు చెబుతున్నారు.