Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల చేతుల్లో నియంత్రణ
- మార్చి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ : తమ క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయాల్సిందీ లేనిదీ ఖాతాదారుడే నిర్ణయించుకునే సౌలభ్యాన్ని కలుగ చేయాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఇందుకోసం దేశంలోని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అన్ని సాధారణ, ఆన్లైన్, జాతీయ, అంతర్జాతీయ కార్డులకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వినియోగదారుల భద్రత, సౌలభ్యాన్ని దష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్టు పేర్కొంది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల్లో పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలను దష్టిలో ఉంచుకొని.. అక్రమాలకు తెర వేయాలనే లక్ష్యంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ బధవారం జారీ చేసిన నిబంధనల ప్రకారం.. క్రెడిట్, డెబిట్ కార్డులను ఎటీఎం, ఫోన్ పరికరాలతో మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ కార్డులను అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలా.. ఎక్కడ ఉపయోగించుకోవాలో.. నియంత్రించుకోవాలనే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. దేశంలో ఎటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) లాంటి కాంటాక్ట్-బేస్డ్ యూజ్ పాయింట్ల వద్ద మాత్రమే అన్ని కార్డులు ఉపయోగించవచ్చు. అయితే ఏ వ్యక్తి అయినా ఆన్లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్లెస్ లావాదేవీల కోసం తన కార్డులను ఉపయోగించకపోతే, ఈ సేవలకు వారి కార్డు నిలిపివేస్తారు. తిరిగి ఈ సేవలను పొందటానికి వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఉన్న కార్డ్ వినియోగదారుల కోసం దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్లైన్, కాంటాక్ట్లెస్ లావాదేవీల కోసం కార్డును నిలిపివేయాలా వద్దా అనే విషయాన్ని బ్యాంకులు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ హెచ్చరికల ద్వారా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాలని ఆర్బీఐ తెలిపింది.
కాగా ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, స్మార్ట్ కార్డులకు, ఢిల్లీ మెట్రో, ముంబయి మెట్రో, బెంగళూరు మెట్రో లాంటి జాతీయ రవాణాలో ఉపయోగించే కార్డులకు ఈ నిబంధనలు తప్పనిసరి కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దేశంలో కార్డుల ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య ప్రతీ ఏడాది అనేక రెట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కార్డు ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య పరిమితిని కూడా ఇకపై వినియోగదారు నిర్ణయించవచ్చు. మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటీఎం, ఐవీఆర్ విధానాల ద్వారా ఈ మార్పు చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా బ్యాంకు శాఖలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు 2020 మార్చి16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.