Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఇంధన పొదుపులో టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండవ స్థానం లభించింది. గతంలోనూ పలుమార్లు ఈ అవార్డుల్ని టీఎస్ఆర్టీసీ దక్కించుకున్నది. పెట్రోలియం పరిరక్షణ పరిశోధన సంఘం (పీసీఆర్ఏ), అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో అవార్టు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ముఖ్యఅతిధిగా హాజరై, ఈ అవార్డుల్ని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్శర్మకు అందచేశారు. అవార్డులో భాగంగా రూ. మూడు లక్షలు నగదు, మొమెంటోను అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో దిల్సుఖ్నగర్, హెచ్సీయూ, ముషీరాబాద్-2 డిపోలకు ఇంధన పొదుపు అవార్డులు లభించాయి. వీటిని ఆయా డిపోల మేనేజర్లు రవీందర్రెడ్డి, దైవాదీనం, కృపాకర్రెడ్డి అందుకున్నారు. ఒక్కో డిపోకు అవార్డుతో పాటు రూ.50వేల నగదు పారితోషికాన్ని కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ ఇంధన పొదుపు అనేది గృహాల నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. టీఎస్ఆర్టీసీ మరింత మెరుగైన సేవలు అందించి, ఉన్నతి సాధించాలని చెప్పారు.