Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివిడెండ్ పెంచాలని ఆదేశాలు..!
- రూ.19వేల కోట్ల కోసం డిమాండ్
- అప్పుల పాలు కానున్న పీఎస్యూలు..!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిని బలహీనపర్చేలా మోడీ సర్కార్ చర్యలు సాగుతున్నాయి. ఆర్థిక మాంద్యం దెబ్బతో దేశ ఖజానాకు ఆదాయం భారీగా పడిపోతున్న నేపథ్యంలో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు కేంద్రానికి ఇచ్చే డివిడెండ్ను పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిమాండ్ చేస్తోన్నట్టు రిపోర్టులు వస్తోన్నాయి. ఇప్పటికే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిధులు కాజేయడానికి పలు ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా చమురు కంపెనీలను కూడా ఉపయోగించుకోవడానికి ఆయా సంస్థలు ఇచ్చే డివిడెండ్ను గతేడాదితో పోల్చితే 5 శాతం పెంచాలని అడుగుతోందని దీంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన ఓ అధికారి పేర్కొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీలు ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఇచ్చే డివిడెండ్లో ఏకంగా 60 శాతం పెంచాలని కేంద్రం డిమాండ్ చేస్తోందని సమాచారం. ఈ ఏడాది ఓఎన్జీసీ నుంచి రూ.6,500 కోట్లు, ఇండియన్ ఆయిల్ నుంచి రూ.5,500 కోట్లు, బీపీసీఎల్ నుంచి రూ.2,500 కోట్లు, గెయిల్ నుంచి రూ.2,000 కోట్లు, ఆయిల్ ఇండియా నుంచి రూ.1500 కోట్లు, ఇంజినీర్స్ ఇండియా నుంచి రూ.1000 కోట్ల చొప్పున డివిడెండ్ డిమాండ్ చేస్తోన్నట్టు సమాచారం.
వ్యతిరేకిస్తున్న కంపెనీలు..
ఈ డిమాండ్ను చమురు కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని సమాచారం. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు ఓ వ్యక్తి తెలిపారు. కేంద్రానికి అధిక డివిడెండ్ చెల్లించడం వల్ల కంపెనీల లాభాలు తగ్గిపోనున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చమురు కంపెనీల లాభాల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అరు మాసాల్లో ఒక్క ఈఐఎల్ లాభాల్లో 4 శాతం పెరుగుదల చోటు చేసుకోగా.. మిగితా అన్ని కంపెనీల లాభాల్లోనూ తగ్గుదల చోటు చేసుకుంది. ఓఎన్జీసీకి 5.5 శాతం, ఇండియన్ ఆయిల్కు 59 శాతం, బీపీసీఎఎల్కు 21 శాతం, గెయిల్కు 27 శాతం చొప్పున లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుంది.
పరపతికి దెబ్బ..
సామర్థ్యానికి మించి కేంద్రానికి అధిక డివిడెండ్ చెల్లించడమంటే ఆయా పీఎస్యూలు తమ వ్యయాలకు కోత పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో కంపెనీ విస్తరణ, సామర్థ్యం, పరపతి దెబ్బతిననుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ఆయా కంపెనీలు అధికంగా అప్పులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు. ఈ పరిణామం పీఎస్యూలకు ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా కేంద్రానికి డివిడెండ్ పెంచితే వాటాదారులు తమ రిటర్న్ అంచనాలు దెబ్బతింటాయని.. దీంతో స్టాక్ మార్కెట్లు కంపెనీ షేర్ విలువ పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. ఓ వైపు పీఎస్యూ చమురు కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను క్రమంగా విక్రయిస్తూ.. మరోవైపు డివిడెండ్ పెంచాలనే డిమాండ్ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని నిఫుణులు పేర్కొంటున్నారు.