Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత త్రైమాసికంలో 30 శాతం పతనం
- కొత్త ప్రారంభాల్లో 44శాతం క్షీణత
- నూతన ప్రాజెక్టుల ఏర్పాటుపై సందిగ్దత
- ద్రవ్య లభ్యత కొరత ప్రభావం
- ప్రాప్ టైగర్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న ఆర్ధిక మాంద్యం ప్రభావం నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తున్నది. జీడీపీలో అత్యంత కీలక వాటా కలిగిన రియల్ ఎస్టేట్ రంగం ద్రవ్య లభ్యత కొరత వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని ప్రాప్టైగర్ డాట్ కమ్ అధ్యయనంలో వెల్లడయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో గృహ అమ్మకాలు 30 శాతం పడిపోయాయని వెల్లడించింది. దేశంలోని తొమ్మిది కీలక ప్రాపర్టీ మార్కెట్లలో ప్రాప్ టైగర్ ల్యాబ్స్ నిర్వహించిన త్రైమాసిక విశ్లేషణలతో రూపొందించిన 'రియల్ ఇన్సైట్ క్యు3ఎఫ్వై 2020'లో పలు విషయాలను వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. రియల్ ఎస్టేట్ రంగం తమ ఆర్థికావసరాల కోసం అధికంగా ఆధారపడుతున్న బ్యాంకింగేతర విత్త సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో బిల్డర్లకు రుణ లభ్యత పడిపోవడంతో డిమాండ్ నెమ్మదించింది. దీంతో గృహ అమ్మకాల్లో స్తబ్దత చోటు చేసుకుంది. ఈ జంట కష్టాలు కారణంగా డెవలపర్లు నూతన ప్రాజెక్టులను ఆచితూచి ప్రారంభిస్తున్నారు. అహ్మాదాబాద్, బెంగళూరు, చెన్నై, గుర్గావ్, హైదరాబాద్, కోల్కతా, ముంబయి, పూణె, నోయిడా నగరాల్లో ఈ సర్వే చేసింది.
అన్ని నగరాల్లోనూ అదే స్థితి..
దేశంలోని కీలకమైన తొమ్మిది ప్రాపర్టీ మార్కెట్లలో క్రితం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో గృహ అమ్మకాలు 30 శాతానికి పైగా పడిపోయాయి. కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని నిలిపేందుకు ప్రభుత్వం ఉద్దీపన చర్యలు తీసుకున్నప్పటికీ అమ్మకాలు పెరగలేదు. 2018 ఇదే డిసెంబర్ త్రైమాసికంలో 91,464 యూనిట్ల అమ్మకాలు కాగా.. క్రితం త్రైమాసికంలో కేవలం 64,034 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. మొత్తం అమ్మకాల్లో 40 శాతం వాటా ముంబయిదే. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే అన్ని మార్కెట్లలోనూ అమ్మకాలు డీలా పడ్డాయి. భారత సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే బెంగళూరులో విక్రయాలు ఏకంగా 50 శాతం పైగా క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది మాసాల్లో 13 శాతం పతనంతో 2,28,220 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో 2,63,294 గృహ అమ్మకాలు జరిగాయి. ఇదే సమయంలో హైదరాబాద్లో 21,505 యూనిట్ల అమ్మకాలు కాగా.. దీంతో పోల్చితే గడిచిన తొమ్మిది మాసాల్లో 11 శాతం తగ్గి 19,097 యూనిట్లుగా నమోదయ్యాయి.
మరో రెండున్నరేండ్లు పట్టొచ్చు..
ప్రస్తుత అమ్మకాల వేగం ఇలాగే కొనసాగితే ఇప్పుడున్న స్టాక్ను విక్రయించుకోవడానికి బిల్డర్లకు మరో 29 నెలల సమయం పడుతుందని ఈ రిపోర్టు అంచనా వేసింది. 2018-19లో ఆర్ధిక సంవత్సరంలో తొమ్మిది కీలక మార్కెట్లలో 5.33 లక్షల గృహాలను విక్రయించారు. కొల్కత్తా, గూర్గ్రావ్ల్లో అత్యధికంగా నూతన ప్రాజెక్టుల ఆరంభం పడిపోయింది. వరుసగా ఇది 79 శాతం, 74 శాతంగా ఉంది. పలు నగరాల్లో ధరలు స్వల్పంగా పడిపోయాయి. కాగా హైదరాబాద్లో 13 శాతం పెరిగాయి. ఈ నివేదికలో అన్ని నగరాల్లో ఇదే అత్యధిక వృద్ధి. గుర్గావ్, అహ్మాదాబాద్లో వరుసగా ఆస్తుల విలువ వరుసగా 6 శాతం, 5 శాతం చొప్పున పెరిగాయి. మిగితా నగరాల్లో 1-3 శాతం వరకు నామమాత్రంగా పెరిగాయి.
బడ్జెట్పైనే ఆశలు..
ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో వృద్ధిని పునరుద్దరించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పలు చర్యల ప్రభావం నామమాత్రంగానే ఉన్నట్టు కనబడుతుందని ఇలారా టెక్నలాజీస్ గ్రూపు సీఈఒ ధృవ అగర్వాల పేర్కొన్నారు. ఈ రంగం జులై-సెప్టెంబర్ కాలంలో 4.5 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి మరింత సహకారం అంచనా వేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రకటించనున్న బడ్జెట్లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం ద్వారా రియాల్టీకి మద్దతు అందించే అవకాశం ఉందన్నారు.