Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థగా పేరున్న ''భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)లో మరోమారు వాటాల విక్రయానికి కేంద్రంలోని మోడీ సర్కారు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ రక్షణ ఉత్పత్తుల కంపెనీలో దాదాపు 15 శాతం వాటాను విక్రయించాలని సర్కారు నిర్ణయించినట్టుగా సమాచారం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఒక ప్రకటన జారీ చేసింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం ద్వారా ఈ వాటాలను విక్రయించనున్నట్లు ఆ ప్రకటన వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీడీఎల్ అత్యాధునిక గైడెడ్ ఆయుధ వ్యవస్థలను తయారు చేయగల సత్తాను కలిగి ఉంది. ప్రస్తుతం బీడీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి 87.75 శాతం వాటా ఉంది. కాల పరిమితి ఏది ప్రకటించనప్పటికీ బీడీఎల్ వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరాంతానికల్లా ముగియవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రకటన నేపథ్యంలో గురువారం బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్ 1.43 శాతం తగ్గి రూ.303.20 వద్ద ముగిసింది. బీడీఎల్తో పాటుగా నేషనల్ అల్యుమినియం కంపెనీ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎండీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తదితర సంస్థల్లో కూడా డిజిన్వెష్ట్మెంట్ను చేపట్టేందకు సర్కారు ఇప్పటికే కసరత్తును పూర్తి చేసిన సంగతి తెలిసిందే.