Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిన్వెష్ట్మెంట్ లోటు భర్తీకి కొత్త యోచన
- ఖజానాకు కాసులను పెంచుకోవడమే లక్ష్యం
- వివిధ సంస్థల విలువైన ఆస్తులకు ఎసరు..!
- ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు: విశ్లేషకులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచిత ఆర్థిక నిర్ణయాలు ఖజానాకు కాసుల కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వం సంపన్నులకు మేలు జరిగే విధంగా కార్పొరేట్ పన్నులను తగ్గించడం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ సవరణలతో పాటు జీఎస్టీ విధానం కారణంగా ఖజానాకు వసూళ్లు పడిపోతూ వస్తున్నాయి. సర్కారు ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో ఖజానాకు దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర పన్ను ఆదాయం తగ్గిపోనుంది. ఇది రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు నిధుల కోసం పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించాలన్న సర్కారు వ్యూహం కూడా ఫలిచడం లేదు. ఫలితంగా సర్కారు ద్రవ్యలోటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వ్యయ నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయలేకపోతున్న ప్రభుత్వం తమ అవసరాల నిమిత్తం దొరికన చోటల్లా నిధులను అందిపుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తోంది.
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి అదనపు మధ్యంతర డివిడెండ్ను కోరడం, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి ప్రత్యేక డివిడెండ్కు ఒత్తిడి చేయడం వంటి చర్యలకు దిగుతోంది. దీంతో పెరిగిపోతున్న ద్రవ్యలోటును పూడ్చుకొనేందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న అమూల్యమైన ఆస్తులను విక్రయించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
డిజిన్వెష్ట్మెంట్ ఫెయిల్..
ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులకు తోడు.. సర్కారు తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాల కారణంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డిజిన్వెష్ట్మెంట్ కార్యక్రమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల విలువైన వాటాలను విక్రయించాలని సర్కారు బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు కేవలం రూ.18,000 కోట్ల డిజిన్వెష్ట్మెంట్ను మాత్రమే చేపట్టగలిగింది. దీంతో ప్రభుత్వ వర్గాలు తీవ్ర నిరుత్సాహంలోకి జారకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చింది. ఈ ఏడాదే బ్లూచిప్ కంపెనీలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), ఎయిరిండియా, కంటైనర్ కార్పొరేషన్ సంస్థల్లో కూడా వాటాలను విక్రయించాలని విశ్వ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల ఆయా సంస్థల్లో డిజిన్వెష్ట్మెంట్ పట్టాలెక్కలేకపోయింది. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ సంస్థల్లో వాటా విక్రయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సర్కారు నిర్ధేశించుకున్న డిజిన్వెష్ట్మెంట్ ప్రక్రియ లక్ష్యాన్ని చేరలేకపోతోంది. ఫలితంగా ఏర్పడుతున్న ద్రవ్యలోటును పూడ్చుకొనేందుకు గాను ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న విలువైన ఆస్తులను విక్రయించాలని సర్కారు వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గంపగుత్తగా ఆయా సంస్థల్లో వాటా విక్రయం ప్రక్రియ జరిపేందుకు గాను ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంపిక చేసిన పీఎస్యూలతో పాటు వివిధ ప్రాంతాలలో విలువైన ఆస్తులను కలిగి ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఆస్తులను కూడా నగదీకరించాలన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. ఆయా సంస్థల పునర్ వ్యవస్థీకరణతో పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టే దిశగా సర్కారులో కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ఒకే రంగంలో ఉన్న వివిధ కంపెనీల మధ్య ఆస్తుల కొనుగోళ్లు జరిపించడంతో పాటు అవసరమైన చోటు ఆయా ఆస్తులను ప్రయివేటుకు అప్పగించే ప్రతిపాదనలను కూడా సర్కారు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖలో ఒక ప్రత్యేక విభాగం పూర్తి స్థాయి కసరత్తు జరుపుతున్నట్టుగా వివిధ కథనాల ద్వారా తెలుస్తోంది.
దీర్ఘకాలంలో చేటు జరగొచ్చు..
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలోని ప్రతికూల పరిస్థితులను ఆసరాగా చేసుకొని తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం పీఎస్యూ ల వద్ద ఉన్న విలువైన ఆస్తులను విక్రయించాలని భావించడం సబబు కాదని.. దీని వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదరయ్యే ఆవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మందగమనం నుంచి బయటపడేందుకు సర్కారు పెద్దలకు, కార్పొరేట్ సంస్థలకు విలువైన తాయిలాలను ప్రకటించడంపై దృష్టి సారించే కంటే.. క్షేత్రస్థాయిలో ప్రజల వినిమయం పెరిగేలా చర్యలు చేపడితే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్ధత దూరమవుతుందని వారు సూచిస్తున్నారు. బడ్జెట్లో భారీగా డిజిన్వెష్ట్మెంట్ లక్ష్యాలను పెట్టుకోవడం కూడా సర్కారు ఇప్పటికైనా తగ్గించుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మరింత పటిష్టం చేసేలా చర్యలు చేపడితే మేలని వారు సూచిస్తున్నారు.