Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్నా.. పరిస్థితి ఇంకా బాగుందని పదే పదే ప్రచారం చేసుకుంటున్న ప్రధాని మోడీ అనుచర వర్గానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్ల షాక్ తగిలింది. దేశంలో నెలకొన్న మాంద్యం దెబ్బకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పడిపోతున్నాయని పన్ను శాఖ అధికారులే స్వయంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాదిలో ఈ పన్ను వసూళ్లు భారీగా క్షీణించి 20 ఏండ్ల కనిష్టానికి పడిపోనున్నాయని దాదాపు అర డజన్ మంది అధికారులు తెలిపినట్లు రాయిటర్స్ సంస్థ ఒక కథనంలో పేర్కొంది. మాంద్యానికి తోడు కార్పొరేట్లకు పన్ను తగ్గింపు వల్ల ఈ పరిస్థితి చోటు చేసుకుందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ 2020 మార్చి 31తో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంలో రూ.13.5 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 17 శాతం అదనం. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో డిమాండ్ క్షీణించడం, వ్యాపారాల్లో స్తబ్దత నెలకొనడం, ఆయా కంపెనీలు కొత్త పెట్టుబడులకు కోత విధించడం, ఉపాధి కల్పన తగ్గడం తదితర పరిణామాలు ప్రత్యక్ష పన్ను వసూళ్ల తగ్గుదలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటు కూడా 5 శాతానికి పరిమితమై 11 ఏళ్ల కనిష్టానికి దిగజారుతున్న క్రమం పన్ను వసూళ్లను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జనవరి ముగింపు నాటికి కేంద్ర పన్నుల శాఖ రూ.7.3 లక్షల కోట్లు వసూళ్లు చేసింది. ఇంతక్రితం ఏడాది సరిగా ఇదే కాలంతో పోల్చితే 5.50 శాతం తగ్గుదల ఉందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరం వసూళ్లు రూ.11.5 లక్షల కోట్లతో పోల్చితే ఈ ఏడాది మరింత తగ్గొచ్చని రాయిటర్స్ ఇంటర్యూలో ఎనిమిది మంది అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో ఇది వరకు ఎప్పుడూ పన్ను వసూళ్లు తగ్గలేదన్నారు. ఈ సారి లక్ష్యాన్ని మర్చిపోవాల్సిందేనన్నారు. 2019 మార్చి ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 10 శాతం తగ్గుదల చోటు చేసుకోనుందని అంచనా వేశారు.
అప్పులే దిక్కు..!
ప్రభుత్వ వ్యయాల్లో 80 శాతం వాటా ప్రత్యక్ష పన్ను లదే ఉంటుంది. ఈ పన్ను వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకుంటే.. ప్రజా సంక్షేమ వ్యయాల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా గతేడాది కార్పొరేట్లపై పన్ను తగ్గింపు నిర్ణయం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని నీరుగార్చింది. కార్పొరేట్లకు పన్ను తగ్గించడం ద్వారా పెట్టుబడులు పెరుగుతాయని, తయారీ రంగం పుంజుకుంటుందని మోడీ సర్కార్ భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి భిన్నంగా మారడం గమనార్హం. క్షేత్ర స్థాయిలో ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా కార్పొరేట్ల పన్ను తగ్గింపు ద్వారా వృద్ధి పుంజుకుంటుందనే భావన సరైం ది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది స్థాయిలోనూ పన్ను వసూళ్లు నమోదైతే చాలా సంతోషమని ఆర్ధిక రాజధాని ముంబయిలోని ఓ సీనియర్ అధికారి పేర్కొ న్నారు. ప్రభుత్వ రెవెన్యూలో మూడో వంతు కలిగిన డైరెక్టు టాక్సెస్ పుంజుకుంటాయని మాత్రం తాను భావించడం లేద న్నారు. ఈ నేపథ్యంలో రానున్న బడ్జెట్లో సర్కారు పన్ను లక్ష్యాన్ని తగ్గించుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు రానున్న రోజుల్లో ప్రభుత్వ ద్రవ్యలోటు కూడా విపరీ తంగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. దీనిని నిలవరిం చేందుకు గాను సర్కారు ఇక అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.