Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాతాదారుల సేవల్లో 'కేర్' అంతంతే
- భారీ స్థాయిలో ఫిిర్యాదుల నమోదు..
- గ్రామీణంలో అత్యధిక 'కంప్లయింట్స్':
- ఆర్బీఐ అంబుడ్స్మెన్ నివేదికలో వెల్లడి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఖాతాదారులకు సంతృప్తికరమైన సేవలను అందించే విషయాన్ని దేశంలోని ప్రయివేటు రంగ బ్యాంకింగ్ సంస్థలు చాలా లైట్ తీసుకుంటున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించిన అంబుడ్స్మెన్ వార్షిక నివేదిక 2018-19 ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే కూడా ప్రయివేటు రంగ బ్యాంకుల్లో అత్యధికంగా ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఈ నివేదిక ప్రకారం వివిధ ప్రయివేటు బ్యాంకుల్లో దాదాపు 54,922 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఇది గంతంలోకంటే చాలా ఎక్కువ. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో ఫిర్యాదుల సంగతికి వస్తే దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్లో (ఎస్బీఐ) అత్యధికంగా 59,522 కంప్లయింట్లు నమోదు అయ్యాయి. మిగతా జాతీయ బ్యాంకుల్లో సంయుక్తంగా దాదాపు 61,755 ఫిర్యాదులు అంబుడ్స్మెన్కు అందాయి. ఎస్బీఐ తరువాత అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా 10,791 కంప్లయింట్స్ నమోదు అయ్యాయి. ఆ తరువాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో 9,385 ఫిర్యాదులు వచ్చాయి. ఇదే సమయంలో ప్రయివేటు బ్యాంకింగ్ సంస్థల విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అత్యధికంగా 15,105, ఐసీఐసీఐ బ్యాంక్లో 11,257, యాక్సిస్ బ్యాంక్లో 10,010 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులలో సంఖ్యాపరంగా అత్యధికంగా ఫిర్యాదులు నమోదైనట్టు కనిపించినా ఆయా బ్యాంకుల విస్తృతితో పోలిస్తే ప్రయివేటు బ్యాంకింగ్ సంస్థల విస్తృతి చాలా తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయా ప్రయివేటు రంగ బ్యాంకుల్లో ఫిర్యాదులు గణనీయంగా నమోదు కావడం చూస్తుంటే అక్కడ ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడే దిశగా ఎలాంటి యంత్రాంగం అమలవుతుందో ఇటే ఊహించవచ్చని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాలలోని బ్యాంకుల్లో ఎదురైన సమస్యలపై ఫిర్యాదుల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదు అయింది. ఈ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఎదురైన సమస్యలపై అందిన ఫిర్యాదుల్లో 10.98% వృద్ధి నమోదు అయినట్టుగా ఈ నివేదిక తెలిపింది. 2018-19లో డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు 32.9 శాతం నుంచి 41 శాతానికి పెరిగాయి. మొత్తం ఫిర్యాదుల్లో వీటిదే సింహ భాగం కావడం విశేషం. శాఖల వారీగా విశ్లేషించి చూస్తే 2018-19లో సగటున ఒక్కో శాఖలో నమోదు అయిన ఫిర్యాదుల సంఖ్య సగటున 1.4గా నిలిచింది. ఇదే సమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్లో అత్యధికంగా 3.3, హెచ్డీఎఫ్సీలో 3.0, భారతీయ స్టేట్ బ్యాంక్లో 2.7 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విశ్లేషణ నేపథ్యంలో ప్రయివేటు బ్యాంకుల కంటే కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు మెరుగైన సేవలను అందిస్తున్నాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.