Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: టోల్ ప్లాజా వద్ద రద్దీని తగ్గించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ''ఫాస్టాగ్'' విధానం తరహాలోనే పెట్రోల్ బంకుల్లోనూ ఫాస్ట్లేన్ అనే విధానం త్వరలోనే అమలులోకి రానుంది. ముంబయికి చెందిన అంకుర సంస్థ ఏజీఎస్ ట్రాన్స్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూపొందించిన కొత్త తరహా సాంకేతికతతో ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ సాంకేతికతను వినియోగించాలనుకుంటున్న వారు ఫాస్ట్లేన్ అనే మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ తరహాలోనే రేడియో ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) రీడర్ స్టిక్కర్ని కారు ముందు భాగంలో అతికించాలి. ఏ ఇంధనం, ఎంత కావాలో బంకుకు చేరుకోవడానికి ముందే యాప్లో ఫీడ్ చేసి పెట్టాలి. బంకులోకి వెళ్లగానే అక్కడ ఉండే ప్రత్యేక వ్యవస్థ ఆర్ఎఫ్ఐడీని రీడ్ చేసి ఫాస్ట్లేన్లో ఫీడ్ చేసిన సమాచారాన్ని సహాయకుడి వద్దకు చేరుస్తుంది. వారు అందుకనుగుణంగా ఇంధనం నింపుతారు. ఇక బిల్లు కట్టడానికి కూడా ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇంధనం నింపగానే వెళ్లిపోవచ్చు. యాప్కి అనుసంధానించిన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు జరిగిపోతుంది. అనంతరం మొబైల్కి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థను ముంబయి, నవీ ముంబయి, థానె, పుణె నగరాల్లోని హెచ్పీసీఎల్కు చెందిన 120 బంకుల్లో అమలు చేస్తున్నారు. త్వరలో మిగతా నగరాలకూ దీన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా ఏజీఎస్ ట్రాన్స్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ అధినేత సతీశ్ జోపె తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ వినియోగాన్ని టోల్ చెల్లింపులతో పాటు పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్, పార్కింగ్ చెల్లింపులకూ విస్తరించాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర రావాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత ఏడాది ఒక సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ యోచన ప్రకారం ఈ విధానం మరో ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా అన్ని బంకుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.