Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్ను ఆదాయం పడిపోతుంటే...30శాతం వృద్ధి సాధ్యమా?
- కేంద్ర బడ్జెట్పై పెదవి విరిస్తున్నఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : '' మేం వచ్చాక అమలుజేసిన ఆర్థిక విధానాలు (నోట్లరద్దు, జీఎస్టీ, పన్ను సంస్కరణలు) సత్ఫలితాల్ని ఇచ్చాయి '' అని ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది. దీంట్లో వాస్తవం కన్నా...ఊహాజనితమే ఎక్కువగా ఉందని, ఆ విషయం బడ్జెట్ గణాంకాలే చెబుతున్నాయని ఆర్థిక నిపుణులు తేల్చారు. ఓ లెక్క ప్రకారం...రావాల్సిన పన్ను ఆదాయమే (12శాతం పడిపోవటం) రావటం లేదని జీఎస్టీ గణాంకాలే చెబుతున్నాయి. అలాంటిది కేంద్ర పన్నల ఆదాయంలో వృద్ధి 30శాతం ఉంటుందని (2020-21 కేంద్ర బడ్జెట్లో), తద్వారా ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని చెప్పటం దేశ ప్రజల్ని ఊహల్లో ఉంచటమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర పన్ను ఆదాయంపై ప్రభుత్వాలు ప్రతి ఏటా వేసే అంచనాలు కాస్త అటూ ఇటూ మారుతుంటాయి. స్వల్పంగా తగ్గటమో, పెరగటమో జరుగుతుంది. ఇది సహజ పరిణామే. కానీ గత కొన్నేండ్లుగా పన్ను ఆదాయంలో ప్రభుత్వం వేస్తున్న అంచనాకు, వాస్తవాలకు మధ్య తేడా చాలా ఎక్కువగా ఉందని ఆర్థిక నిపుణులు గుర్తుచేస్తున్నారు. 2018-19 బడ్జెట్లో సవరించిన అంచనాకు, వాస్తవాలకు (పన్ను ఆదాయంలో)మధ్య తేడా 7.5శాతంగా కనపడింది. 2019-20లో ఆ తేడా 12శాతానికి చేరుకుందని తేలింది. బడా కార్పొరేట్లకు, అత్యంత ధనవంతులకు పన్ను ప్రయోజనాలు కల్పించటం వల్లే పన్ను ఆదాయం పడిపోవటం బడ్జెట్ గణాంకాల్లో స్పష్టంగా కనపడుతున్నది.
కాగ్ లెక్కకు సరిపోవటం లేదు
ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్కు ముందు పన్ను ఆదాయంపై 'కాగ్' కూడా తన నివేదికను విడుదలచేస్తుంది. పన్ను ఆదాయంపై కాగ్, ప్రభుత్వ బడ్జెట్ లెక్కలకు పొంతన కుదరాలి. లేదంటే ఎక్కడో తేడా ఉన్నట్టే ! ఉదాహరణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్ను వసూళ్లు రూ.15,04,587కోట్లు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. అయితే కాగ్ చెప్పినదాన్ని బట్టి.. 2019 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కేంద్ర పన్నుల ఆదాయం రూ.9,04,944కోట్లు. అంటే మిగతా మూడు నెలల్లో (జనవరి-మార్చి) దాదాపు రూ.6లక్షల కోట్లు వసూళ్లు కావాల్సి ఉంటుంది. ఈ మందగమనంలో అది సాధ్యమా?