Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్జీలు పెంచాలని ఆపరేటర్ల విజ్ఞప్తి
ముంబయి: ఇకపై ఎటిఎంల్లో నగదు ఉపసంహరణలు, నిల్వ తనిఖీ చేసుకోవడం మరింత భారం అయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. ఇంటర్ఛేంజ్ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఎటిఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసినట్లు ఇటి ఓ కథనంలో వెల్లడించింది. ఇందుకు ఆర్బిఐ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎటిఎంల వినియోగం, వ్యాప్తిని పెంచేందుకు ప్రతిపాదనల కోసం గతేడాది ఆర్బిఐ ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత డిసెంబరులో తమ ప్రతిపాదనలను రిజర్వ్ బ్యాంక్కు సమర్పించింది. అందులో ప్రధానంగా ఇంటర్ఛేంజ్ ఫీజులను పెంచాలని సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పట్టణ ప్రాంతాల్లో ఎటిఎం ఇంటర్ఛేంజ్ ఫీజును నగదు లావాదేవీపై రూ. 17, నగదేతర లావాదేవీపై రూ.7కు పెంచాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఒక బ్యాంక్ కార్డును వేరే బ్యాంక్కు చెందిన ఎటిఎంల్లో వినియోగించినప్పుడు సదరు ఎటిఎం ఆపరేటర్కు ఖాతాదారుడు ఇంటర్ఛేంజ్ ఫీజు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. వినియోగదారులకు ఐదు లావదేవీలను ఉచితంగా అందిస్తూ ఆ పైన జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నాయి. పరిమితి దాటిన తర్వాత చేసే నగదు లావాదేవీలపై రూ.15, నగదు రహిత లావాదేవీల సమాచారంపై రూ. 5 చొప్పున ఈ ఛార్జీలు అమల్లో ఉన్నాయి. కాగా ఇంటర్ఛేంజ్ ఫీజులను పెంచాలని ఎటిఎం ఆపరేటర్ల సంఘం కోరింది. ఎటిఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్బిఐ పెంచిన నేపథ్యంలో ఎటిఎంల నిర్వహణ ఖర్చు పెరిగిందని ఇందులో పేర్కొంది. దీని వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిపింది. ఈ పరిణామాల వల్ల కొత్త ఎటిఎంలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని తెలిపారు. అందుకే ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నామని చెప్పారు. అదే విధంగా ఉచిత లావాదేవీలను మూడుకు పరిమితం చేయాలని కోరింది. పరిమితి దాటిన తర్వాత చేసే నగదు లావాదేవీలపై ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఫీజులను రూ.18, రూ. 8కి పెంచాలని సూచించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను ఆర్బిఐ పరిశీలిస్తోందని సమాచారం.