Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకులు మూల్యం చెల్లించుకోవచ్చు..!
- ఏ కంపెనీ మూతపడ్డా కష్టమే
- ఎస్బీఐ ఛైర్మెన్ రజ్నీష్ కుమార్
న్యూఢిల్లీ : టెలికం కంపెనీలకు ఇచ్చిన అప్పులపై బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. టెలికం కంపెనీలు తీసుకున్న రుణాలు చెల్లించకుండా దివాలా తీస్తే.. బ్యాంకులు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ రజ్నీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. టెల్కోలు కేంద్రానికి సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల కింద రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రజ్నీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీం ఆర్డర్ నేపథ్యంలో టెల్కోల పరిస్థితిపై వేచి చూడాలని అన్నారు. ఒక వేళ ఆ కంపెనీలపై ఎదైనా ప్రతికూల ప్రభావం పడితే అది బ్యాంకులు, ఉద్యోగులు, విక్రయదారులు, వినియోగదారులు తదితర అందరిపై ప్రభావం పడనుందన్నారు. దీంతో బ్యాంకులు తగు మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఉంటుందన్నారు.
న్యూఢిల్లీలోని లోకల్ హెడ్ ఆఫీస్లో జరిగిన 'మనస్వి అండ్ తపస్వీ' కార్యక్రమంలో పాల్గొన్న రజ్నీష్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏదైనా కార్పొరేట్ కంపెనీ మూత పడితే ఆ ప్రభావం భారత ఆర్ధిక వ్యవస్థ పడుతుందన్నారు. ఈ క్రమంలో వాటిని మూతపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎవైనా టెల్కోల రుణాలు మొండి బాకీలుగా మారాయా..? అన్న ప్రశ్నకు రెండు ఖాతాలు ఎన్పిఎలుగా ఉన్నాయని రజ్నీష్ తెలిపారు. ఎయిర్సెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్)లు దివాలా తీసిన విషయాన్ని గుర్తు చేశారు.
బ్యాంకుల నెత్తిన లక్ష కోట్ల గుదిబండ..!
ఇప్పటికే లక్షల కోట్ల మొండి బాకీల గుదిబండను ఎదుర్కొంటున్న భారత బ్యాంకుల నెత్తిన మరో పిడుగు పడే ప్రమాదం పొంచి ఉంది. ఎజిఆర్ బకాయిలు ఎలాగైనా చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వొడాఫోన్ఐడియా(విఐఎల్) దివాలా ప్రకటించే అవకాశం ఉందని బ్యాంకులు భయపడుతున్నాయి. ఇదే జరిగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్యాంకింగ్ రంగంలో తిరిగి కొన్నేళ క్రితం పరిస్థితులు తలెత్తవచ్చని, మొండిపద్దుల గుదిబండ మెడలో పడొచ్చని ఆందోళన పడుతున్నాయి. ఇప్పటికే బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్న రెండు టెల్కోలు ఆర్కామ్, ఎయిర్సెల్కు సంబంధించిన కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వొడాఐడియా కూడా ఇదే దోవలోచేరితే మరిన్ని ఇక్కట్లు తప్పవని బ్యాంకర్ల ఆందోళన. స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు(ఎస్యుసి), లైసెన్స్ ఫీజులకు సంబంధించిన సవరించిన స్థూల ఆదాయం (ఎజిఆర్)పై బకాయిల చెల్లింపులు చేయాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా టెల్కోలపై పెను భారం పడనుంది. అదే జరిగితే టెల్కోలకు పలు బ్యాంకులు ఇచ్చిన రూ.1 లక్ష కోట్ల మేర రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎజిఆర్ తీర్పు నేపథ్యంలో 2019 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఉమ్మడిగా దాదాపు రూ.74వేల కోట్ల నష్టాలు ప్రకటించాయి. దీంతో ఈ రెండిటికి అప్పులిచ్చిన బ్యాంకుల పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానాలు ఊపందుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ ఎస్బిఐ అత్యధికంగా భారతీ ఎయిర్టెల్, వొడా ఐడియాలకు రూ.37,330 కోట్ల అప్పులిచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు రూ.24,515కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ. 17,135కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.11,471 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7,300 కోట్లు మేర రుణాలు అందించాయి. ఈ మొత్తాలు నిరర్ధక ఆస్తులుగా మారినా లేదా చెల్లింపుల్లో జాప్యం జరిగిన అప్పులిచ్చిన బ్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.
బకాయిలు చెల్లిస్తాం : వొడాఫోన్ ఐడియా
వచ్చే కొద్ది రోజుల్లో ఏజీఆర్ బకాయిలు చెల్లిస్తామని వొడాఫోన్ ఐడియా శనివారం ఓ ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని పేర్కొంది. డిఒటికి స్థూల ఆదాయాలపై పన్ను (ఎజిఆర్) ఎంత చెల్లించాలనే దానిపై సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. కేంద్రానికి ఈ సంస్థ రూ.54,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని డిఒటి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీ ఎయిర్టెల్ రెండు దఫాల్లో ఎజిఆర్ బకాయిలను చెల్లిస్తామని ఇది వరకే ప్రకటన చేసింది.
అంతర్గతంగా చర్చిస్తాం : ఆర్బీఐ గవర్నర్
టెల్కోల బకాయిలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అంతర్గతంగా చర్చించనుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. అయితే దీనిపై శక్తికాంతదాస్ పూర్తి వివరణ ఇవ్వలేదు. ఎజిఆర్ బకాయిలపై ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయే చర్చిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్పై తాను ఎలాంటి కామెంట్ చేయలేనన్నారు. వచ్చే కొన్ని నెలల్లో దేశంలో రుణాల జారీ పుంజుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.