Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే రాష్ట్రాలకు చెల్లింపుల్లో జాప్యం
- తెలంగాణకు అన్యాయం చేయలేదు
- 2వేల నోట్ల రద్దు తెలీదు:కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
జీఎస్టీ వసూళ్లు తగ్గడం వల్లే రాష్ట్రాలకు సకాలంలో నిధులు విడుదల చేయలేకపోయామని కేంద్ర ఆర్ధికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నదని, కేవలం తెలంగాణకే ఇవ్వడం లేదనేది సత్యదూరమని స్పష్టం చేశారు. ఆదివారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జీఎస్టీ పరిహారాన్ని రెండు నెలలకోసారి ఇవ్వాల్సి ఉందనీ, వసూళ్లు లేకే అలా ఇవ్వలేకపోతున్నామన్నారు. వసూళ్లను బట్టి తెలంగాణకు జీఎస్టీ వాటాను ఇచ్చేశామని, జీఎస్టీ సెస్ వసూళ్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించారనేది కూడా వాస్తవం కాదన్నారు. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల్నే తాము అమలు చేస్తున్నామని, దేశంలో ఒక రాష్ట్రం తక్కువై, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పెరిగాయని (కాశ్మీర్ విభజన), అందువల్లే పన్నుల వాటాను తగ్గించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి 2010-15లో రూ.46,746 కోట్ల నిధుల్ని ఇస్తే, గడచిన ఐదేండ్లలో (2015-20) 128 శాతం పెంచి రూ.1,06,606 కోట్ల నిధుల్ని ఇచ్చామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గుతున్నాయనే ఆరోపణను ఆమె ఖండించారు. ఈ పథకానికి డిమాండు ఆధారంగా నిధులు కేటాయిస్తామని, డిమాండు అధికంగా ఉంటే నిధులు కూడా పెరుగుతాయని చెప్పారు. డిమాండు లేకపోవడం వల్లనే నిధుల కేటాయింపులు తగ్గినట్టు తెలిపారు. రెండు వేల రూపాయల నోట్ల రద్దు గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, తన దృష్టికి ఆలాంటి విషయం ఏదీ రాలేదన్నారు. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.756 కోట్ల ప్రత్యేక గ్రాంటు కూడా అందకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆ ప్రతిపాదనను తిరిగి ఆర్థిక సంఘం పరిశీలనకే పంపామని, ఏ పద్దు కింద ఆ ప్రత్యేక కేటాయింపు చేశారో ఆర్ధికసంఘం చెప్తే, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక కారణాల వల్లే రాష్ట్రాల్లోని రైల్వే పనుల్లో జాప్యం జరుగుతున్నదని, నిధుల కేటాయింపు లేక కాదని స్పష్టం చేశారు. స్థానిక ఎంపీలు ప్రాజెక్టుల వారీగా వివరాలు అందిస్తే రైల్వే మంత్రి దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కషి చేస్తానని చెప్పారు. ఆర్ధికసంఘం ఒక్క ఏడాది ప్రతిపాదనలు మాత్రమే ఇచ్చిందనీ, ఈ ఏడాది అక్టోబర్ నాటికి మిగిలిన నాలుగేండ్ల ప్రతిపాదనలు ఇస్తుందని, దాని ప్రకారమే నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాన్ని కొందరు తప్పుపడుతున్నారని, తాను పార్లమెంటు పరిభాషలో మాట్లాడానని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్పీకర్కు నోటీసు ఇవ్వవచ్చని తెలిపారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో వ్యాపార, వాణిజ్యవేత్తలతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలు తీసుకొనే కార్యక్రమానికి ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టామన్నారు. దీనివల్ల ప్రభుత్వంలో పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో కూడా ఈ తరహా సమావేశాన్నే నిర్వహించామని, ఢిల్లీ, ముంబయి, కోల్కత్తా పట్టణాల్లో వచ్చిన అభిప్రాయాలే ఇక్కడా వచ్చాయన్నారు. బెంగళూరు, మీరట్లో కూడా ఇదే తరహా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కేంద్ర వ్యయశాఖ కార్యదర్శి టి వి సోమనాథన్, రెవెన్యూ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి, సీబీడీటీ చైర్మెన్ పీసీ మోడీ, సీబీఐసీ చైర్మెన్ అజిత్ కుమార్ పాల్గొన్నారు. అంతకు ముందు కేంద్రమంత్రి వాణిజ్య, పరిశ్రమ, బ్యాంకర్లు, రైతు సంస్థల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, పన్ను మదుపుదారులు విద్యా రంగ నిపుణులతో సమవేశమై బడ్జెట్పై అభిప్రాయాలు తెలుసుకున్నారు.