Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాదికన్నా 50 శాతం అధికం
- పౌరులపై పడనున్న వడ్డీల భారం
న్యూఢిల్లీ: విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు(డిస్కంలు) 2019 డిసెంబర్ వరకల్లా రూ.88,177 కోట్లు బాకీ పడ్డాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే బకాయిల విలువ 50 శాతం అధికం. 2018 డిసెంబర్లో బకాయిలు రూ.59,015 కోట్లు. ప్రాప్తి పోర్టల్లో పొందుపరిచిన లెక్కలివి. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల మధ్య లావాదేవీలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రాప్తిని 2018 మే నెలలో ప్రారంభించారు.
విద్యుత్ సరఫరా చేసిన తర్వాత బాకీల వసూళ్లకు 60 రోజుల వరకూ పంపిణీ సంస్థలకు సమయమిస్తారు. ఆ తర్వాత చెల్లించాలంటే అదనంగా వడ్డీ కట్టాలి. 2019 డిసెంబర్ వరకూ సకాలంలో చెల్లించని బకాయిలు రూ.78,174 కోట్లు కాగా, అంతకుముందు ఏడాది ఇదే సమయానికి బకాయిల విలువ రూ.44,464 కోట్లు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు హామీగా చెల్లింపుల రక్షణ యంత్రాంగాన్ని 2019 ఆగస్టు 1న కేంద్రం ఏర్పాటు చేసింది.
పంపిణీ సంస్థలు బాకీ పడటమంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని అర్థం. ఓవైపు పౌరుల నుంచి నెలనెలా విద్యుత్ చార్జీల్ని అపరాధ రుసుములతోసహా(ఆలస్యపు చెల్లింపులకు) వసూలు చేస్తున్న ప్రభుత్వాలు పంపిణీ సంస్థలకు బాకీలు పడటం, వడ్డీలు చెల్లించాల్సి రావడం ఆక్షేపణీయం. ఆ వడ్డీలన్నీ పౌరుల నుంచే వివిధ రూపాల్లో తిరిగి రాబడ్తారన్నది గమనార్హం. అధికారిక డేటా ప్రకారం అధిక మొత్తాల్లో బకాయిలు చెల్లించాల్సిన రాష్ట్రాల్లో రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ఉన్నాయి. బకాయిలు రాబట్టుకోవాల్సిన కేంద్రప్రభుత్వరంగ ఉత్పత్తి సంస్థలు: ఎన్టీపీసీ రూ.15695.65 కోట్లు, ఎన్ఎల్సీ ఇండియా రూ.5010.69 కోట్లు, ఎన్హెచ్పీసీ రూ.3165.09 కోట్లు, టీహెచ్డీసీ రూ.2136.30 కోట్లు, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ రూ.822.09 కోట్లు. ప్రయివేట్ ఉత్పత్తి సంస్థలు: అదానీ పవర్ రూ.3201.68 కోట్లు, బజాజ్ గ్రూప్ రూ.2212.66 కోట్లు, జీఎంఆర్ రూ.1930.16 కోట్లు. సౌర,పవన విద్యుత్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిల విలువ 6739.47 కోట్లు.