Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది 9.1 శాతానికే పరిమితం
- గతేడాదికంటే దిగువకు జీతాల పెంపు
- తీవ్ర మందగమన పరిస్థితులే కారణం
- ఆటోరంగంలో భారీగా జీతాలు కుదేలు:ఏయాన్ పీఎల్సీ సంస్థ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమనం తీవ్రతరమవుతున్న వేళ.. కంపెనీలు ఉద్యోగుల జీతాల పెంపునకు కోత పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దేశంలో వినిమయం తగ్గుతూ డిమాండ్ పడిపోతున్నందున కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో సంఘటిత రంగంలోని కంపెనీలు ఈ ఏడాది సగటున 9.1 శాతం జీతాల వృద్ధిని మాత్రమే ప్రకటించే అవకాశం ఉందని ఏయాన్ పీఎల్సీ సంస్థ ఒక సర్వే నివేదికలో తెలిపింది. ఇది దాదాపు దశాబ్ద కాల కనిష్టమని సంస్థ విశ్లేషించింది. 2009 తరువాత కంపెనీల జీతాల సగటు పెంపు ఇంత కనిష్టానికి చేరడం ఇదే తొలిసారి అని సంస్థ తెలిపింది. జీతాల పెంపు అంతకు ముందు 2018లో 9.5 శాతం, 2019లో 9.3 శాతం మేర ఉన్నట్టు సంస్థ తెలిపింది. దేశంలోని 20 రంగాలకు చెందిన దాదాపు 1000 కంపెనీల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొంటూ ఏయాన్ సంస్థ ఈ సర్వే నివేదికను రూపొందించింది. కంపెనీలు కనిష్ట జీతాల పెంపును ప్రకటిస్తుండడం దేశంలో తీవ్రతరమవుతున్న ఆర్థిక మందమగన పరిస్థితులు ప్రతిబింబిస్తోందని ఏయాన్ తెలిపింది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్లో ఇలాంటి పరిస్థితులు నమోదు అవుతుండడం మొత్తం ఆసియా ఖండంలోని ఆర్థికంపై ప్రభావం చూపుతున్నట్టు తెలిపింది. దేశంలో ఉద్యోగ అవకాశాలపై పెరుగుతున్న నిరాశావాదంతో ప్రజలు ప్రధానంగా తమ వినిమయాన్ని తగ్గించుకొనేలా చేస్తోందని ఈ నివేదిక తెలిపింది. ఈ తరహా పరిణామం వృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని కనబరస్తోందని ఏయాన్ అభిప్రాయపడింది. దేశంలో చూస్తే జీతాల పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని ఇతర దేశలతో పోలిస్తే మేలేనని ఏయాన్ వివరించింది. ఆసియాలోని చాలా ఇతర ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం, సముచితమైన నైపుణ్యం కలిగిన వారు లేకపోవడం తదితర కారణాల వల్లే భారత్ మెరగ్గా కనిపిస్తోందని అభిప్రాయపడింది. గత దశాబ్ద కాలంతో పోలిస్తే ఈ ఏడాది భారత్లో తక్కువగా జీతాల పెంపు ఉండవచ్చని అంచనా వేయడం వెనుక తాము అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టుగా ఏయాన్ సంస్థ భాగస్వామి జైటల్ ఫెర్నాండెజ్ తెలిపారు. దేశంలో వినియోగదారు సెంటిమెంట్ మరీ బలహీనంగా ఉండడం, జీడీపీ అంచనాలు అంతకంతకు పడిపోతుండడం కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు కూడా తమ ఉత్పత్తి కార్యకలాపాలు, మార్జిన్లనపై తీవ్ర డోలాయానంలో ఉన్నాయని సర్వే నివేదిక తెలిపింది. ఈ పరిస్థితుల కారణంగానే జీతాల పెంపును తాము తక్కువగా అంచనా వేసినట్టు తెలిపారు. ఈ ఏడాది ఈ-కామర్స్ సంస్థలు, స్టారప్ సంస్థలలో ఎక్కువగా జీతాల పెంపు ఉండవచ్చని ఏయాన్ అంచనా కట్టింది. ఈ రంగాలలో దాదాపు 10 శాతానికి పైబడే పెంపు ఉండవచ్చని సంస్థ విశ్లేషించింది. ఇదే సమయంలో విత్త రంగంలోని సంస్థల్లో ఈ పెంపు 8.5 శాతం దరిదాపుల్లో ఉండవచ్చని సంస్థ తెలిపింది. అదే సమయంలో ఆటోమొబైల్ రంగంలో అతిపెద్ద స్థాయిలో జీతాల తగ్గుదల నమోదు కావొచ్చని తెలిపింది. 2018లో 10.1 శాతంగా ఉన్న ఈ రంగంలోని జీతాల వృద్ధి ఈ ఏడాది 8.3 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరింత గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది.