Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కావొచ్చు
- చైనా పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోగలదు
- 'లోటు' లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ పరిమితంగానే ఉండే అవకాశం ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ పెద్దది కావడం వల్లకారణంగా ప్రపంచ వృద్ధిరేటు కరోనా కారణంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో కేవలం ఒకటి, రెండు రంగాలు కరోనా కారణంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. అయితే దీనిని అధిగమించేందుకు గాను ప్రత్యామ్నాయల అన్వేషణ మొదలు పెట్టినట్టుగా ఆయన తెలిపారు. స్థూలంగా చూస్తే దేశంలో ఔషధ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలే ఎక్కువగా ముడి సరుకుల నిమిత్తం చైనాపై ఆధారపడటం కనిపిస్తోందని ఆయన వివరించారు. కరోనా వైరెస్ వ్యాప్తి సమస్యను దేశీయంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల విధానకర్తలు చాలా దగ్గరగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనిఅన్నారు. 2003లో కూడా ''సార్స్'' వైరెస్ ప్రపంచాన్ని గజగజలాడించిందన్నారు. ఈ సమస్య కారణంగా అప్పట్లో చైనా ఆర్థిక వృద్ధి దాదాపు 1 శాతం మేర ప్రభావితమైనట్టుగా ఆయన తెలిపారు. అప్పట్లో చైనా ప్రపంచంలో ఆరో ఆర్థిక వ్యవస్థగా ఉంటూ ప్రపంచ జీడీపీలో 4.2 శాతం వాటాను కలిగి ఉండేందని అన్నారు. ఇప్పుడు చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. ప్రపంచ జీడీపీలో ఆ దేశం వాటా 16.3 శాతానికి చేరిందని ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎక్కువగానే ప్రతిబింబించే అవకాశం ఉందని వివరించారు. కరోనా వ్యాప్తిని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత సమస్యను చైనా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొనగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని చాలా పెద్ద ఫార్మా కంపెనీలు దాదాపు మూడు, నాలుగు నెలలకు సరిపడేలా ముడిసరుకుల నిల్వలను ఉంచుకుంటాయని ఆయన అన్నారు. దీంతో ఫార్మా రంగానికి కూడా తక్షణం ఏర్పడే సమస్యలేమీ లేవని ఆయన వివరించారు. చైనా నుంచి రావాల్సిన మొబైల్ సర్క్యుట్ బోర్డులు, టీవీ పరికరాలు, డిస్ల్పే బోర్డులను కూడా తాత్కాలికంగా ఇతర దేశాల నుంచి తెప్పించి.. దేశంలో ముడిసరుకు లోటు రాకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నట్టుగా ఆయన వివరించారు.