Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను వేడుకున్న మిట్టల్, బిర్లా
న్యూఢిల్లీ: దేశంలోని టెలికాం రంగం గడిచిన మూడున్నరేండ్లుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని భారతీ ఎయిర్టెల్ సంస్థ అధినేత సునీల్ భారతీ మిట్టల్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న టెలికాం రంగం నిలదొక్కుకొని.. సుస్థిరత సాధించే దిశగా సర్కారు దృష్టి సారించాలని ఆయన కోరారు. బుధవారం ఆయన ఢిల్లీలోని ఆర్థికశాఖ కార్యాలయంలోని ఉన్నతాధికారలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ టెలికాం రంగం నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టుగా తెలిపారు. సుప్రీం కోర్టు తాజా తీర్పు కారణంగా కొత్తగా ఏర్పడనున్న ఏజీఆర్ బకాయిల విషయాన్ని తాను అధికారులతో చర్చించలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలకు దేశంలో టెలికాం రంగం శాశ్వతంగా నిలిచి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. టెలికాం రంగం దేశాభివృద్ధికి అత్యావశ్యకమని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సర్కారు టెలికాం రంగం సుస్థిరతకు దోహదం చేయాలని ఆయన కోరారు. సుప్రీం తీర్పు కారణంగా ఏర్పడే అదనపు ఏజీఆర్ బకాయిలను చెల్లించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను తాము ఇప్పటికే ప్రకటించినట్టుగా ఆయన తెలిపారు. ఎయిర్టెల్ సంస్థ దాదాపు రూ.35000 కోట్ల మేర ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఇందులో సంస్థ ఇప్పటికే రూ.10,000 కోట్ల చెల్లింపులు జరిపింది. ఆర్థికశాఖలో ఉన్నతాధికారులను కలిసేందుకు వెళ్లే ముందు మిట్టల్ టెలికాం శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. మంగళవారం టెలికాం శాఖ కార్యదర్శితో సమావేశమైన వొడాఫోన్-ఐడియా సంస్థల చైర్మెన్ కుమార మంగళం బిర్లా కూడా ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అయితే మిట్టల్, బిర్లాలు ఇద్దరు కలిసి ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారా లేక విడివిడిగా కలిశారా అన్న విషయం స్పష్టత రాలేదు.