Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజీఆర్ భారంతో ఇబ్బందుల్లో సంస్థలు
న్యూఢిల్లీ: దేశంలో టెలికాం సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సర్కారుకు టెలికాం సంస్థలు చెల్లించాల్సిన బకాయిల విషయం సీరియస్ అవుతుండడంతో సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గడువులోగా బకాయిలను చెల్లించాలంటూ సంస్థలకు డీవోటీ నోటీసులు ఇస్తుండడంతో సంస్థలు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. వివిధ రూపాల్లో ఈ బకాయిలను చెల్లించేందుకు సంస్థలు నానా కష్టాలు పడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి వివిధ రూపాల్లో అప్పులు తీసుకొని బకాయిలు చెల్లిస్తున్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు భవిష్యత్తులో వీటిని తీర్చేందుకు గాను చార్జీలు పెంచడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం మినహా ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ఒకవైపు 5జీ నెట్వర్క్ విస్తరణపై భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి.. మరోవైపు జియోకు వినియోగదారులు చేజారిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి.. ఇంకోవైపు కేంద్రానికి భారీ బకాయిలు చెల్లించక తప్పని పరిస్థితి.. ఈ నేపథ్యంలో సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ ప్రతికూలత నుంచి బయటపడేందుకు గాను టెలికాం సంస్థలు డిసెంబర్లో ఏకంగా 42 శాతం వరకు చార్జీలను పెంచేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఏడాది కాలంలో మరింత పెంపునకు సంస్థలు సిద్ధం అవుతున్నాయని సమాచారం. జియో రాక పూర్వం ఒక జీబీ డేటా వినియోగానికి రూ.200కుపైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మోస్తరు కాల్స్ చేసుకునే వారు కూడా నెలకు రూ.200 వరకు వెచ్చించే వారు. కానీ, 2016లో జియో అడుగుపెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఉచితంగా ఆరంభించిన జియో భారీగా వినియోగదారులను సొంతం చేసుకుంది. డేటా, కాల్స్ను పరిమితి లేకుండా ఉచితంగా అందించి వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జియో దెబ్బకు రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్, టాటా డొకొమో, టెలినార్ ఇలా అందరూ దుకాణాలను మూతేసుకోవాల్సి వచ్చింది. మూడేళ్లలోనే జియో చందాదారుల సంఖ్యా పరంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. జియో విధ్వంసాన్ని తట్టుకోలేక ప్రధాన టెలికం ప్లేయర్లు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ విలీనమైన వొడాఫోన్ ఐడియాగా అవతరించాయి. జియో మినహా ఇతర సంస్థలు ఆదాయం పడిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో సర్కారు నుంచి తాజాగా ఏజీఆర్ బకాయిలు వచ్చిపడడం కంపెనీలు గుక్క తీప్పుకోకుండా చేస్తోంది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో గత 20 ఏళ్లకు సంబంధించి స్పెక్ట్రమ్, ఇతర బకాయిల రూపంలో టెల్కోలు ఇప్పుడు కేంద్రానికి రూ.1.47 లక్షల కోట్లను చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్టెల్ రూ.35వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.53 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు వాటి ముందున్న మార్గం చార్జీల పెంపే. అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు మళ్లీ వచ్చేలా ఉన్నాయి. లేదంటే జేబు నుంచి మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.