Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్ను భారాల్ని తగ్గిస్తున్న సర్కారు
- లబ్దిపొందుతున్న బడాబడా సంస్థలు..
- ఖజానాకు తగ్గుతున్న పన్ను ఆదాయం
- జాడలేని కొత్త పెట్టుబడులు, ఉపాధి..!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కేంద్రంలోని మోడీ సర్కారు కార్పొరేట్ సంస్థలకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్లకు పన్నులు తగ్గిస్తే ఆయా సంస్థలు కొత్త పెట్టుబడులతో ముందుకు వస్తాయన్నది సర్కారు వాదన. ఇలా చేయడం వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవానికి అలా జరగడం లేదు. కేంద్రం ప్రకటిస్తున్న పన్ను తగ్గింపులను పూర్తిస్థాయిలో జేబులో వేసుకుంటున్న సంస్థలు..కొత్త ఉపాధి సౌకర్యాలను కల్పించే విషయాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు రెండు రకాలుగా నష్టం జరుగుతోంది. పన్ను తగ్గింపుల వల్ల ఖజానాకు ఆదాయం తగ్గిపోతోంది. దీంతో దేశంలో ద్రవ్యలోటు రికార్డు స్థాయిలకు పెరుగుతోంది. మరోవైపు కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు కార్పొరేట్లు మాత్రం సర్కారు పన్ను తగ్గింపులతో కలుగుతున్న పన్ను ఆదాయపు ఆదాను దర్జాగా తమ ఖాతాల్లో వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సర్కారు చెబుతున్న లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో సర్కారు కలిగిస్తున్న వివిధ మినహాయింపులు కారణంగా కార్పొరేట్ల పన్ను చెల్లింపుల భారం 165 బేసిస్ పాయింట్ల మేర తగ్గి 27.84 శాతానికి చేరింది. అయితే డివిడిండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మొత్తాన్ని కలుపుకుంటే పన్ను చెల్లింపుల భారం 30.4 శాతానికి చేరుకుంది. అయినా గతంలో అన్ని సర్చార్జీలు, సెస్లను కలుపుకొని కార్పొరేట్లు చట్ట ప్రకారం చెల్లించాల్సిన 34.6 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉండడం విశేషం.
2018-19 కేంద్ర బడ్జెట్లో సర్కారు రూ.250 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీల చట్టబద్ధమైన పన్ను రేటును 25 శాతానికి తగ్గించింది. దీంతో వార్షికంగా రూ.10-50 కోట్ల మేర పన్ను చెల్లింపు ముందు లాభాన్ని కలిగి ఉన్న సంస్థల పన్ను భారం భారీగా తగ్గింది. ఈ నిర్ణయంతో చిన్న కంపెనీల పన్నుభారం 141 బేసిస్ పాయింట్ల మేర తగ్గి 27.58 శాతానికి చేరింది. సర్కారు చర్యతో రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ పన్ను మదింపునకు ముందు ఆదాయం కలిగిన సంస్థల పన్నుభారం 26.01 శాతానికి తగ్గింది. సర్కారు నిర్ణయంతో పెద్ద కంపెనీల పన్నుభారం దాదాపు 29 బేసిస్ పాయింట్ల మేర తగ్గడం విశేషం. దాదాపు ఆరేండ్ల నుంచి కార్పొరేట్ సంస్థలు మోడీ సర్కారుతో నడిపిన లాబీయింగ్ కారణంగానే 2028-19లో పన్ను భారం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆదాయం పన్నులోని వివిధ ఇతర లొసుగులను ఆసరాగా చేసుకొని దేశంలోని కార్పొరేట్ సంస్థలు తమ పన్ను భారాన్ని మరింతగా తగ్గించుకున్నట్టుగా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఫలితంగా ఖజానా ఆదాయానికి భారీగా గండిపడింది. అయితే చిన్న సంస్థల వారు మాత్రం ఈ లబ్దిని పొందలేకపోయారు.
భారీగా ఊగిసలాట..
కేంద్రలోని మోడీ సర్కారు దేశ ఆర్థిక స్థితిగతులను పక్కనబెడుతూ కార్పొరేట్లకు మేలు చేసేలా ప్రకటనలు చేస్తుండడంతో వివిధ రూపాల్లో పన్ను ఆదాయం తగ్గుతూ వస్తోంది. 2012-13 నుంచి కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన ప్రభావిత పన్ను, చట్టబద్ధంగా చెల్లించాల్సిన పన్నులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గత దశాబ్దంలో పన్నుతీరులో హెచ్చుతగ్గులను గమనిస్తే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. 2010-11లో 24.1 శాతంగా ఉన్న వాస్తవ ప్రభావిత పన్ను రేటు 2012-13లో 22.44 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో చట్టబద్ధమైన పన్నురేటు కూడా 33.21 శాతం నుంచి 32.44 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో 2017-18 నాటికి ఎఫెక్టివ్ ట్యాక్స్రేట్ 29.49 శాతానికి చట్టబద్ధమైన పన్ను రేటు 34.6 శాతానికి ఎగిసింది. ఆ తరువాత నుంచి మోడీ సర్కారు మళ్లీ పన్ను భారాన్ని సుంకాలు, సర్చార్జీల రూపంలో తగ్గించడం విశేషం. దీంతో కంపెనీలు బాగా లబ్దిపొందాయి. ముఖ్యంగా బడాబడా కార్పొరేట్ కంపెనీలైతే చట్టంలోని లొసుగులను ఆసరగా చేసుకొని గరిష్టస్థాయిలో లబ్దిపొందాయి.