Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశం అభివృద్ధి చెందాలంటే వ్యాపార, వాణిజ్య విధానాలను మరింత సులభతరం చేయాల్సి ఉంటుందని మోడీ ప్రభుత్వపు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ అన్నారు. శనివారం ఐఐటీ కాన్పూర్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ ఆశిస్తున్న 350 లక్షల కోట్ల భారీ ఆర్థిక వ్యవస్థ స్వప్నం సాకారం కావాలంటే సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో దేశంలో ఆచరణలో ఉన్న ఆశ్రిత పెట్టుబడిదారి విధానం కొన్ని దశాబ్దాల వరకు కేవలం వ్యాపార వర్గాల వారికి, అధికారంలో ఉన్నవారికే లబ్ది చేకూర్చుతూ వచ్చిందని అన్నారు. దేశంలో 1991 నుంచి ఆర్థిక సంస్కరణల పర్వం ఊపందుకున్నప్పటి నుంచి సులభతరవ వాణిజ్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన వివరించారు. దేశంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రో-బిజినెస్ పాలసీలు తోడ్పడుతాయని, అంతేకాకుండా వ్యాపార వర్గాల్లో పోటీ తత్వాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేవలం ప్రస్తుత ఆర్థిక నిపుణులపైనే ఆధారపడకుండా, బహుళ ప్రాచుర్యం పొందిన ప్రాచీన అర్థశాస్త్రం లాంటి గ్రంథాలను అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. సంపద సృష్టించే మెళకువలను ప్రాచీన కాలం నాటి అర్థశాస్త్రంలో చక్కగా వివరించారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్లో సూచించినట్టుగా దేశంలోనే ముడిసరుకుల ఉత్పత్తి వల్ల భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశం దూసుకెళ్లాలంటే ఎక్కువ స్థాయిలో ముడిసరుకులను ఎగుమతి చేయాలని తెలిపారు.