Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుట్టలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు
- నిర్వహణే సమస్య
- అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతిపెద్ద సవాలు
- పరిష్కరించకుంటే కష్టాలు తప్పవు : నిపుణులు
న్యూఢిల్లీ : ఓవైపు సాంకేతికరంగం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ దానికనుగుణంగానే ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్థాలూ గుట్టల్లా పేరుకుపోతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంటే ఇప్పటికే చెందిన దేశాల నుంచే ఈ-వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పోగవుతుండటం గమనార్హం. దీనికి అడ్డుకట్ట వేయకుంటే పర్యావరణానికి భారీ ముప్పు వాటిల్లే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ)-2019 నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులోనూ అభివృద్ధి చెందిన దేశాల నుంచే అధికంగా పోగవుతున్నాయని ఆ నివేదిక నొక్కి చెప్పింది.
యూనైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ (యూఎన్యూ) తాజా నివేదిక ప్రకారం... ప్రపంచంలో ఉత్పత్తవుతున్న మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిమాణం 4,500ల ఈఫిల్ టవర్లతో సమానం. వాటిని రోడ్డుపై పారబోస్తే అది న్యూయార్క్ నుంచి బ్యాంకాక్ (28 వేల కిలోమీటర్లు) దాకా ఉండొచ్చని అంచనా. అంతేగాక బరువు పరంగా కొలిస్తే ఇప్పటివరకు అన్ని దేశాలు కలిపి తయారుచేసిన వాణిజ్య విమానాల కంటే ఎక్కువ అని యూఎన్యూ తెలిపింది.
సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను భారీ లోహాలైన సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియంలతో తయారుచేస్తారు. వీటితోపాటు ప్రమాదకరమైన కెమికల్స్నూ వాడతారు. అంతేగాక వీటికి బంగారం, రాగి, పలాడియంలనూ కలుపుతారు. అభివృద్ధి చెందిన యూఎస్, స్విట్జర్లాండ్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఎలక్ట్రానిక్ వస్తువులను భారీగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. భారత్లో సగటున ఒక వ్యక్తి 2 కిలోల ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంటే అదే స్విట్జర్లాండ్లో 25 కిలోల దాకా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్ట్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం స్విట్జర్లాండ్ కావడం గమనార్హం.
నిర్వహణే అసలు సమస్య
ఏటా కోట్ల టన్నుల కొద్దీ ఉత్పత్తవుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే పారబోస్తున్నారు. 1989లో జరిగిన ఒక ఒప్పందం (బేసెల్ కన్వెన్షన్ ఆన్ ది కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్స్ ఆఫ్ హజర్డస్ వేస్ట్) ద్వారా 'ఈ చెత్త'ను 'విరాళాల' పేరిట దిగువ మధ్య తరగతి దేశాల్లో పారబోయడానికి అంగీకారం కుదిరింది. ఇది 1992 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో భారత్, నైజేరియా, ఘనా వంటి దేశాలూ ఈ వ్యర్థాలు పారబోయడానికి వేదికలయ్యాయి. భారత్లోని ప్రధాన నగరాల్లో ఈ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటిని సమర్థవంతంగా రీసైక్లింగ్ చేసే వ్యవస్థ ఇంకా ఈ దేశాల్లో లేదు. ఈ కారణంగా ఈ పరిశ్రమలున్న చోట పనిచేసే వారే గాక చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులలో ఉండే లోహాలు, కెమికల్స్ కారణంగా సహాజ వనరులైన భూమి, నీరు, గాలి వంటివీ కలుషితమవుతున్నాయి. దిగుమతి అవుతున్న ఈ వ్యర్థాల్లో 20 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతన్నదని ఓ అంచనా.
నివారించకుంటే కష్టాలే..
పట్టణాలు, సముద్ర తీరాల్లో గుట్టలుగా పేరుకుపోయి ఉన్న వీటిని పట్టణ గనులు (అర్భన్ మైన్స్)గా పిలుస్తున్నారు. అయితే కొన్నిచోట్ల వీటిని పూడ్చటానికి భూమిని తవ్వి అందులో పాతిపెడుతున్నట్టు.. మరికొన్నిచోట్ల కాలబెడుతున్నట్టు తెలుస్తున్నది. దీనిద్వారా వెలువడే ఉద్గారాలతో పర్యావరణాకి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని వెంటనే నివారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దిగుమతౌతున్న ఎలక్ట్రానిక్ వస్తువులను సమర్థవంతంగా వాడుకుంటే తప్ప దీనికి మరో మార్గం లేదని వారు సూచిస్తున్నారు. అంతేగాక పాలకులు, పౌర సమాజం కూడా దీనిపై బాధ్యతగా వ్యవహరించాలనీ, లేకుంటే భారీ ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం కఠినమైన విధానాలను రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని వారు సూచిస్తున్నారు.