Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జూన్ త్రైమాసికంలో 3.1 శాతమే
- 2020-21లో 4.1శాతంగా ఉండొచ్చు
- మాంద్యానికి తోడు కరోనా దెబ్బ
- గ్లోబల్ వృద్ధి 0.40 శాతమే
- బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ రిపోర్టు
- 24 గంటల్లోనే జీడీపీ అంచనాలు సమీక్ష
న్యూఢిల్లీ : నోట్ల రద్దు, జీఎస్టీ, ప్రయివేటు ఆర్ధిక సంస్థల దివాలా లాంటి ప్రతికూలాంశాలకు తోడు మాంద్యం దెబ్బతో భారీగా పడిపోయిన భారత వృద్ధి రేటు కరోనా ప్రభావంతో మరింత పతన స్థాయికి పడిపోనుందని రిపోర్టులు వస్తోన్నాయి. ప్రస్తుత ఏడాది జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ ఏకంగా 90 బేసిస్ పాయింట్లు తగ్గి 3.1 శాతానికి పరిమితం కానుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం 2020-21లో జీడీపీ 4.1 శాతానికి దిగజారనుందని గురువారం ఓ రిపోర్టులో వెల్లడించింది. ఇంతక్రితం రోజు ఇదే బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా జూన్ త్రైమాసికంలో 4 శాతం వృద్ధి రేటు ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుత మార్చి త్రైమాసికానికి 30 బేసిస్ పాయింట్లు తగ్గించి 4 శాతంగా అంచనా వేసింది. కాగా 2020-21లో 5.1 శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి రేటు అత్యల్పంగా 2.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఒక్క రోజు కూడా గడవక ముందే ఈ గణంక అంచనాలను సవరించడం గమనార్హం. వచ్చే 2020-21 భారత వృద్ధి రేటు అంచనాల్లో 100 బేసిస్ పాయింట్లు కోత పెట్టి 4.1 శాతానికి, జూన్ త్రైమాసికం అంచనాలకు 90 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. ప్రపంచ వృద్ధి రేటుకు ఏకంగా 180 బేసిస్ పాయింట్లు కోత పెట్టి కేవలం 0.40 శాతం వృద్ధి మాత్రమే ఉండొచ్చని విశ్లేషించింది.
గ్లోబల్ వృద్ధి ఢమాల్..
ఏప్రిల్ మధ్య నాటికి పరిస్థితి మరింత తీవ్రతరం కావొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా ఆర్ధిక నిపుణులు ఇంద్రాని సేన్ గుప్తా, ఆస్తా గుడ్వాని పేర్కొన్నారు. అన్ని రకాల దేశీయ ఆర్ధిక వ్యవస్థలో స్తభించే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ త్రైమాసికం, వచ్చే ఆర్ధిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలకు కోత పెట్టామన్నారు. కరోనాతో ప్రపంచ సంక్షోభం నెలకొనే పరిస్థితులు ఉన్నాయన్నారు. భారత్లో ఏప్రిల్ ముగింపు లేదా ఏప్రిల్ మధ్య నాటికి సాధారణ బంద్ నెలకొనొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ సంక్షోభంతో 2020లో అంతర్జాతీయ వృద్ధి రేటు ఏకంగా 180 బేసిస్ పాయింట్లు పడిపోయి 0.4 శాతానికి పరిమితం కావొచ్చని ఈ రిపోర్టుల పేర్కొంది. బుధవారం నాటి అంచనాల్లో ఇది 2.2 శాతం వృద్ధిగా ఉంది. అమెరికా జీడీపీ 0.8 శాతానికి, చైనా వృద్ది రేటు 1.5 శాతానికి పరిమితం కావొచ్చని ఈ రిపోర్టు అంచనా వేసింది.
వడ్డీ రేట్లకు కోత..
పలు అనిశ్చిత్తుల నేపథ్యంలో ఆర్బిఐ వరుసగా వడ్డీ రేట్లను తగ్గించొచ్చని పేర్కొంది. ఏప్రిల్, జూన్, అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లు తగ్గొచ్చని అంచనా వేసింది. కరోనాతో దేశీయంగా బంద్లు, బలహీన కార్పొరేట్ల ఫలితాల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్లు పలు చర్యలకు ఉపక్రమించనున్నాయని పేర్కొంది. 2020-21లో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 1 శాతం మేర తగ్గించనున్నాయని అంచనా వేసింది. ఇదే సమయంలో ఆర్బీఐ 38 బిలియన్ డాలర్లు (రూ.2.66 లక్షల కోట్లు) నగదును మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషించింది.