Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సగం కంపెనీలపై కరోనా కాటు
- నగదు ప్రవాహం పడిపోనుంది
- రికవరీకి కొన్ని నెలలు పట్టొచ్చు : ఫిక్కీ సర్వే
ముంబయి : ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా వైరస్ భారత్లోని సగం పైగా కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించనుందని ఓ సర్వేలో వెల్లడైంది. దేశంలోని 53 శాతం కంపెనీల నిర్వహణపై ఒత్తిడి పడనుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఫిక్కీ) సర్వే పేర్కొంది. సంస్థల్లో నగదు ప్రవాహం తగ్గిపో నుందని 80 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఈ సర్వే ప్రకారం.. కరోనా వల్ల వివిధ రంగాల్లో డిమాండ్కు సరఫరాకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడి భారత ఆర్థిక వద్ధికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని దేశం ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తమయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసిక ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. దేశంలోని వివిధ రంగాల పారిశ్రామిక వర్గాలతో కలిసి చర్చించిన ఈ సర్వేను రూపొందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 53 శాతం కంపెనీలపై కరోనా ప్రభావం పడనుంది. నగదు ప్రవాహం తగ్గిపోనుందని 80 శాతం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్షీణత వల్ల ఆయా కంపెనీలు జరపాల్సిన చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, రుణ తిరిగి చెల్లింపులు, పన్నులు కట్టడానికి ఇబ్బందులు ఎదు రవుతాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి. కంపెనీలన్నీ మహమ్మారినీ ఎదుర్కొనేం దుకు పరిశుభ్రతపై దష్టిపెట్టాలని ఫిక్కీ సూచించింది.
ఆర్బీఐ చొరవ..
ప్రస్తుత సమయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మద్దతు చాలా అవసరం. ఆర్బిఐ కీలక వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాల్సిన అవసరం ఉందని ఫిక్కీ సర్వే అభిప్రాయపడింది. బ్యాంకులు కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా చెల్లింపులను రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నగదు సరఫరా క్షీణతను దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు, ఎన్బీఎఫ్సీ, బ్యాంకులు నగదు సరఫరా నిర్వహించాల్సిన అవరసం ఉందని అంచనా చేసింది. కార్పొరేట్ బాండ్స్, కమర్షియల్ పేపర్ మార్కెట్లు సైతం ద్రవ్య సమస్యలు ఎదుర్కొంటాయని వీటిపై నేరుగా గానీ వాణిజ్య బ్యాంకుల ద్వారా గానీ ఆర్బీఐ కల్పించుకోని సమస్యలు పరిష్కరించాలని తెలిపింది.
ప్రభుత్వ వ్యయం తగ్గొద్దు..
పన్ను వసూళ్లలో కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం మూలధన వ్యయ ప్రణాళికలను తగ్గించరాదని ఫిక్కీ సర్వేలో అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇంకా కరోనా ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న హోటల్, విమానయానం వంటి రంగాలపై తాత్కాలికంగా దివాలా కోడ్ను నిలిపివేయాలని కోరాయి. 60 శాతం సరఫరా చైన్ దెబ్బతింటుందనీ, కంపెనీలు సాధారణ స్థితికి చేరడానికి మూడు నెలల సమయం పడుతుందని దాదాపుగా 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 30 శాతం సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాయి. ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటికే దేశ ఆర్ధికాభివృద్ధి రేటు 4.7 శాతానికి పరిమితమై ఆరేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.