Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పింక్ స్లిప్ల జారీలో కంపెనీలు
- ప్రమాదంలో 1.5 లక్షల సిబ్బంది
- కరోనా ఎఫెక్ట్
నవతెలంగాణ - వాణిజ్య ప్రతినిధి
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు అతలాకుతలం కావడంతో భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, బీపీఓ, ఐటీ ఆధారిత విభాగాల్లో పని చేస్తున్న లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని రిపోర్టులు వస్తున్నాయి. చిన్న కంపె నీల నుంచి పెద్ద వాటి వరకు సిబ్బందిని తొలగించే ఆలోచ నలు చేస్తున్నట్టు సమాచారం. వచ్చే మూడు నుంచి ఆరు మాసాల కాలంలో భారత ఐటీ రంగంలో పని చేసే వారిలో 1.5లక్షల ఉద్యోగాలు ఊడొచ్చని మానవ వనరుల (హెచ్ ఆర్) నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా చిన్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని సియోల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆదిత్యా నారాయన్ మిశ్రా పేర్కొన్నారు. ఈ ఐటీ పరిశ్రమపై 40-45 లక్షల మంది ఉద్యోగులు ఆధారపడి ఉన్నారు. ఇందులో చిన్న ఐటీ కంపెనీల వాటా 10-12 లక్షలుగా ఉంది. దేశంలోని ఐదు అతిపెద్ద ఐటీ కంపెనీల్లో 10 లక్షల మేర ఉద్యోగులు పని చేస్తున్నారు.కరోనా వైరస్ వల్ల ఇప్పటికే అన్ని కీలక దేశాల్లోని తయారీ రంగం స్తబ్దతలోకి జారింది. మైక్రోసాఫ్ట్, ఆపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు వచ్చే త్రైమాసికాల్లో తమ ప్రగతి కుంటుపడొచ్చని ఇన్వెస్టర్లను హెచ్చరించింది. కొన్ని దేశాల్లో లాక్డౌన్ మే వరకు పొడిగించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఐటీ రంగంలో తీవ్ర అనిశ్చితిని పెంచనున్నదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా పలు కంపెనీలు సిబ్బందికి పింక్ స్లిప్లను జారీ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. గత 25 ఏండ్ల ఐటీ పరిశ్రమలో ఇదే అత్యంత దుర్బర పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎగుమతులపై పెను ప్రభావం
కరోనా వల్ల ఐటీ ఎగుమతులపైనా పెను ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలు నేపథ్యంలో అమెరికా, యూరప్ క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాల్లో కోత విధిస్తుండటం భారత ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్లపై ప్రతికూల ప్రభావం పడనుందని ఆ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆరునెలల్లో ఐటీ రంగంలో రాబడి 2 నుంచి 7 శాతం తగ్గుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషించిందని ఓ జాతీయ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ ఈ ఏడాది ప్రధమార్ధంలో వద్ధి రేటు మందగమనాన్ని ఎదుర్కొంటాయని అంచనా వేశారు. ఐటీ కంపెనీలు ధరల ఒత్తిళ్లను ఎదుర్కొంటాయనీ, ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రభావంతో రాబడి నష్టం వాటిల్లుతుందని ఐసీఐసీఐ డైరెక్టర్ దేవాంగ్ భట్ పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో వ్యాపారం దెబ్బతినే క్రమంలో వద్ధి రేటును యాక్సెంచర్ 6-8 శాతం నుంచి 3-6 శాతానికి కుదించిన బాటలోనే భారత ఐటీ కంపెనీలు నడుస్తాయని అంచనా వేస్తున్నారు. కరోనా వల్ల ట్రావెల్, హాస్పిటాలిటీ, ఎయిర్లైన్స్, రిటైల్, హైటెక్, ఫైనాన్షియల్, తయారీ రంగాలకు చెందిన క్లయింట్ల నుంచి వచ్చే వ్యాపారం భారీగా తగ్గనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.