Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-తగ్గనున్న వ్యక్తిగత ఆదాయాలు
- అధ్వానంగా ఐటీ మీడియా, తయారీ రంగాలు
- లింక్డెన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే ఆరు మాసాల్లో ఐటీ, మీడియా, తయారీ రంగాలు అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కోనున్నాయని లింక్డెన్ సర్వేలో వెల్లడయ్యింది. ఈ సంస్థల్లో కొత్తగా నియామకాలు లేకపోగా.. ఉన్న ఉద్యోగుల వేతనాల్లో కోతలు చోటు చేసుకుంటాయని మంగళవారం వెల్లడించిన రిపోర్టులో తెలిపింది. ఏప్రిల్ 1-7, 13-19 తేదిల్లో అన్లైన్లో నిర్వహించిన ఈ సర్వేలో 2,254 మంది పాల్గొన్నారు. దీనిప్రకారం.. వచ్చే ఆరు మాసాల్లో తమ సంస్థలు వేతనాల చెల్లింపుల్లో అధ్వానంగా వ్యవహరించనున్నాయని మీడియా రంగంలోని ప్రతీ ఐదుగురులో ఇద్దరుపైగా ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్పకాల భవిష్యత్తు విషాదకరంగా ఉంటుందన్నారు. అదే విధంగా తయారీ రంగంలో ప్రతీ ఐదుగురిలో నలుగురు, ఐటీ రంగంలో ఒక్కరు ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆదాయాల్లో తగ్గుదల చోటు చేసుకోనుందని ప్రతీ ముగ్గురిలో ఒక్కరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వచ్చే రెండు వారాలు అయితే ఎలాంటి నియామక ప్రకటనలు ఉండవని ఆందోళన వ్యక్తం అయ్యింది. ముఖ్యంగా ఐటీ నిపుణులు తమ రంగ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆన్లైన్ బోధకులకు డిమాండ్
దాదాపుగా అన్ని రంగాలు నియామకాలను నిలిపివేయడం పట్ల ఉద్యోగార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయని 48 శాతం మంది యాక్టివ్ ఉద్యోగార్థులు పేర్కొన్నారు. వచ్చే రెండు వారాలు ఎదురు చూస్తే కాని ఏమీ చెప్పలేమని 36 శాతం మంది అభి ప్రాయపడ్డారు. కాగా ఆన్లైన్లో బోధించే వారికి 67 శాతం డిమాండ్ పెరిగినట్లు ఈ సర్వేలో వెల్లడయ్యింది. సంపాదనలో తగ్గుదల చోటు చేసుకుందని 32 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా వ్యక్తగత వ్యయం పడిపోయిందని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమ ఆదాయంలో భారీగా తగ్గుదల చోటు చేసుకుందని స్వయం ఉపాధి నిపుణులు పేర్కొన్నారు.