Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మొండి బాకీలు పెరుగొచ్చు
- మారటోరియంతో రుణ గ్రహీతలకు శుభవార్త
- బ్యాంక్లకు క(న)ష్టాలే..!
- రూ.5.5 లక్షల కోట్లు ఎన్పీఏలుగా మారొచ్చు
- సగంపైగా కార్పొరేట్లవే..!
- నిపుణుల అంచనా
నవతెలంగాణ - వాణిజ్యప్రతినిధి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన మారటోరియం రుణగ్రహీతలకు సంతోషం కలిగించే అంశం కాగా.. బ్యాంక్లకు తీవ్ర కష్ట, నష్టాలను తెచ్చిపెట్టనుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లాక్డౌన్ దెబ్బతో బ్యాంక్లు ఒక్క ఏడాదిలోనే లక్షల కోట్ల మొండి బాకీలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇండియా రేటింగ్స్ రిపోర్టు అంచనా వేసింది. టర్మ్ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపులపై విధించిన మారిటోరియాన్ని ఆర్బీఐ మరో మూడు నెలలు పొడిగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీంతో రుణ గ్రహీతలకు మొత్తం ఆరునెలల పాటు ఉపశమనం లభించినట్లయ్యింది. దేశంలో అమలు చేస్తోన్న లాక్డౌన్ వల్ల ఆర్ధిక వ్యవహారాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ కరోనా సంక్షోభం వల్ల ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత బ్యాంకింగ్లో రూ.5.5 లక్షల కోట్ల మొండి బాకీలు పెరుగొచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇందులో కార్పొరేట్ రంగానికి సంబంధించి రూ.3.4 లక్షల కోట్లు నిరర్ధక ఆస్తులుగా మారొచ్చని పేర్కొంది. కార్పొరేటేతర ఎన్పీఎలు రూ.2.1 లక్షల కోట్లుగా అంచనా వేసింది. డిమాండ్ లేకపోవడంతో అనేక రంగాలు రెవెన్యూ పతనాన్ని చవి చూడొచ్చని ఇండియా రేటింగ్స్ విశ్లేషించింది. దీంతో బ్యాంక్ స్థూల నిరర్దక ఆస్తుల్లో మరో 5.7 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేసింది. బ్యాంక్లు 2015-16 నుంచి 2019-20 వరకు బ్యాంక్లు తీవ్ర కేటాయింపుల భారాన్ని చవి చూశాయి. ఇందులోనూ కార్పొరేట్లవే ఎక్కువని రేటింగ్ ఎజెన్సీ పేర్కొంది. కరోనా సంక్షోభంతో మరింత సంక్షోభం నెలకొంటుందని తెలిపింది. లాక్డౌన్ పూర్తయి ఆర్ధిక వ్యవస్థలో అన్ని కార్యకలాపాలు పుంజుకుంటేనే బ్యాంకులకు తగిలిన ఎదురుదెబ్బలపై స్పష్టత వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బ్యాంక్లు రూ.10 లక్షల కోట్ల మేర మొండి బాకీలతో సతమతం అవుతున్నాయి.
ఒక్క సారికట్టాలంటే భారమే..
ఆర్బీఐ ప్రకటించిన ఆరు మాసాల మారటోరియం వల్ల బ్యాంక్లపై మూలధన ఒత్తిడి, నిరర్ధక ఆస్తుల భయాలు భారీగా పెరుగొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకుల వారీగా పరిశీలిస్తే ప్రస్తుతం బంధన్బ్యాంకు ఇచ్చిన రుణాల విలువలో 71 శాతం మారిటోరియం కింద ఉన్నాయి. ఆర్బీఎల్ రుణాల విలువలో 35 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్ బ్యాంకుల్లాంటి సంస్థల రుణాల విలువలో 26-30 శాతం మేర మారటోరియం కిందకు వస్తున్నాయని అంచనా. 2016లో ప్రకటించిన నోట్ల రద్దు వల్ల బ్యాంక్ల ఆస్తుల నాణ్యత దెబ్బతిన్నది. ప్రస్తుత పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని, అన్ని రంగాలు ఒత్తిడిలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రుణాల చెల్లింపు మరింత ఆలస్యం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆరునెలల మారటోరియం అనంతరం ఏడో మాసం ఆరంభంలో రుణగ్రహీత ఆరు నెలల వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుందని, దీంతో చాలామంది కట్టకుండా ఎగ్గొట్టే ప్రమాదం ఉందని ప్రభుదాస్లీలాధర నిపుణుడు అజరు హెచ్చరించారు. వేతనాలు లేని ఈ వేళ అంత మొత్తం ఒకేసారి కట్టాలంటే ఖాతాదారులకు ఇబ్బంది అవుతుందన్నారు. ఈ ప్రభావం బ్యాంక్లపై పడొచ్చన్నారు. ఈఎంఐల మారిటోరియం కన్నా రుణ పునర్వ్యవస్థీకరణకు ఆర్బిఐ అనుమతించి ఉండాల్సిందని నిపుణులు సూచిస్తున్నారు.