Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ ఫార్మా సంస్థ గ్లెన్మార్క్ ఫార్మా కరోనా వైరస్ నిరోధ ఔషధ తయారీలో మరో అడుగు ముందుకేసింది. వైరస్ సోకిన రోగులపై ఇప్పటికే మూడు దశల ప్రయోగాలను నిర్వహించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా యాంటీవైరల్ ఫావిపిరావిర్, ఉమిఫెనోవిర్ మందులపై మూడవ దశలో కీలకమైన మరో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి పొందినట్లు పేర్కొంది. దేశంలో కరోనా రోగులలో ఈ రెండు యాంటీవైరల్ మందుల కలయికలో 'ఫెయిత్ ట్రయల్' గా పిలిచే ట్రయిల్స్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుండి అనుమతి లభించిందని గ్లెన్మార్క్ వెల్లడించింది. ఫావిపిరవిర్, ఉమిఫెనోవిర్ యాంటీవైరల్ డ్రగ్స్ రెండూ వేర్వేరు చర్యలను కలిగి ఉంటాయని, వాటి కలయికతో వ్యాధి ప్రారంభ దశలో రోగులలో అధిక వైరల్ లోడ్లను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని, తద్వారా మెరుగైన చికిత్స సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉందని తెలిపింది. ఈ అధ్యయనంలో కరోనావైరస్ మోడరేట్ లక్షణాలు ఉన్న 158 మంది పాల్గొంటారని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవడానికి తాము చేయగిలిందంతా చేస్తామని గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇండియా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా బిజినెస్ అధ్యక్షుడు సుజేష్ వాసుదేవన్ పేర్కొన్నారు.