Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జీడీపీ గణంకాల వెల్లడి
న్యూఢిల్లీ : గడిచిన ఆర్ధిక సంవత్సరం (2019-20)నకు సంబంధించిన ఆర్ధిక గణంకాలను నేడు (మే 29న) కేంద్ర గణంకాల శాఖ అధికారికంగా వెల్లడించనుంది. వృద్ధి రేటు అత్యంత పేలవంగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఇప్పటికే పలు రేటింగ్ ఎజెన్సీలు, అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అంచనా వేశాయి. ముఖ్యంగా 2020 జనవరి నుంచి మార్చితో ముగిసిన త్రైమాసికంలో వృద్ధి రేటు అత్యంత పేలవంగా నమోదు కానుందని పేర్కొన్నాయి. దేశంలో ఆర్ధిక మాంద్యం తాండవిస్తుంటే మరోవైపు కరోనా వైరస్ను అరికట్టడానికి మార్చి చివరి వారంలో విధించిన లాక్డౌన్ వృద్ధి రేటును మరింత ప్రభావితం చేసింది. మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 3.6 శాతానికి పరిమితం కావొచ్చని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. మొత్తం ఆర్ధిక సంవత్సరంలో ఇది 4.7 శాతం పెరుగుదలగా ఉండొచ్చని తెలిపింది. మార్చి త్రైమాసికంలో జిడిపి వృద్ధి 2-4 శాతం మధ్య ఉండొచ్చని అనేక ఎజెన్సీలు అంచనా వేశాయి.
2020-21లో మైనస్ 5% వృద్ధి : ఎస్అండ్పీ
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2020-21)లో భారత వృద్ధి రేటు మైనస్ 5 శాతానికి పడిపోనుందని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ ఎస్అండ్పీ అంచనా వేసింది. కరోనా వైరస్ను అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల ఆర్ధిక వ్యవహారాలు పూర్తిగా నిలిచిపోవడంతో జీడీపీ అమాంతం పడిపోనుందని పేర్కొంది. జీడీపీ వృద్ధి 1.8 శాతంగా ఉండొచ్చని ఇంతక్రితం ఏప్రిల్లో ఎస్అండ్పీ వేసిన అంచనాలకు కోత పెట్టినట్టయ్యింది. ఫిచ్ రేటింగ్, క్రిసిల్ కూడా 5 శాతం ప్రతికూల వృద్ధి నమోదు కావొచ్చని ఇటీవలే అంచనా వేశాయి.